హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రైతులతో పెట్టుకున్న బీజేపీకి మూడిందని, వచ్చే ఎన్నికల్లో రైతులే బుద్ధిచెప్తారని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణకు ఒరగబెట్టిందేమిటని ప్రశ్నించారు. మంగళవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కిషన్రెడ్డి కిసాన్ ప్రతినిధి కాదని, పొలిటికల్ టూరిస్ట్ అని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రూ.10 వేల కోట్లు తీసుకొనిరాలేని దద్దమ్మ అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏమిటో తన గురువైన వెంకయ్యనాయుడిని అడగాలని హితవు చెప్పారు. ఉద్యమకాలంలో రాజీనామా చేయకుండా పారిపోయిన చరిత్ర కిషన్రెడ్డిదేనని గుర్తుచేశారు. బీజేపీ స్మగ్లర్ల అడ్డాగా మారిందని, ఎంపీ అరవింద్ను మించిన స్మగ్లర్ ఎవడైనా ఉన్నాడా? అని ప్రశ్నించారు. బీజేపీలో త్రిపుల్ ఆర్ అంటే రెచ్చగొట్టడం, రచ్చచేయడం, రద్దుచేయడమేనని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి దమ్ముంటే తెలంగాణ రైతుల కోసం సోనియా, రాహుల్గాంధీని మోదీ ఇంటి దగ్గర ధర్నాకు కూర్చోబెట్టాలని సవాలు చేశారు.