హైదరాబాద్, జనవరి 3 (నమస్తేతెలంగాణ): ఓ వ్యక్తి కాంగ్రెస్ను కబ్జా చేసే అవకాశం లేదని, కబ్జా చేయాలనుకొంటే చూస్తూ ఊరుకోబోమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. సోమవారం సీఎల్పీ కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్కు సోనియా, రాహుల్గాంధీలే బలమని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లు చేసేదేంలేదని పేర్కొన్నారు. పార్టీలో బురద జల్లే సంస్కృతి ఈ మధ్యే మొదలైందని, ఎవడో ఏదో అనుకొంటే తాను రాజకీయం చేయలేనని స్పష్టంచేశారు. సీఎంను కలిస్తే పార్టీ మారుతున్నారనే తప్పుడు ప్రచారం సరికాదన్న జగ్గారెడ్డి.. కాంగ్రెస్లో పీజేఆర్ కంటే తీస్మార్ఖాన్ లేరని, పీజేఆర్ కూడా ఇతర పార్టీల సీఎంలను కలిసేవారని గుర్తుచేశారు. పార్టీ అధ్యక్షుడిని కలిస్తే తప్పు కానీ.. సీఎంని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తాను కూడా సీఎంనీ కలవాలని అపాయింట్మెంట్ అడుగుతున్నానని చెప్పారు. మరియమ్మ లాకప్డెత్ విషయంలో సీఎంను కలిసేందుకు తనను, పీసీసీని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడిగారని, అందరం కలిసి వెళ్లామని.. అంతమాత్రాన పార్టీ మారినట్టా అని నిలదీశారు.
సీఎల్పీ నేత భట్టిని ఎవరు ఇబ్బంది పెడుతున్నారనేది ఆయనకే తెలుసని, అతనిపై కూడా బురద చల్లితే ఇంకేముంటుందని ఆవేదన వ్యక్తంచేశారు. భట్టి ఆవేదనను కూడా అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో అక్రమంగా చేసిన లేఔట్ ప్లాట్లను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్కు జగ్గారెడ్డి లేఖ రాశారు. పేద, మధ్య తరగతి వాళ్లు కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించాలని కోరారు. హెచ్ఎండీఏ పరిధిలో అనుమతి లేని లేఔట్లలో ప్లాట్లు కొన్న పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లను క్రమబద్ధీకరించడం వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుందని సూచించారు.