జగిత్యాల రూరల్, డిసెంబర్ 8 : జగిత్యాలలో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోతె శివారులో ఏర్పాటు చేసిన సీఎం భారీ బహిరంగ సభ జగిత్యాల చరిత్రలో నభూతో నభవిష్యతి అని పేర్కొన్నారు. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రుల కార్యక్రమాలు జరిగినా ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కాలేదన్నారు. సీఎం సభకు వస్తున్న సమయంలో దారి పొడవునా ప్రజలు ఘన స్వాగతం పలికారన్నారు. అలాగే సభ విజయవంతం కావడంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కీలకపాత్ర పోషించారని, సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
బహిరంగ సభకు అశేష జనం తరలిరావడంతో ఇటు కొండగట్టు నుంచి అటు మోహన్రావుపేట వరకు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయన్నారు. అధికారులు, పోలీసులతోపాటు సభలో స్వచ్ఛందంగా వలంటీర్లుగా పనిచేసిన టీఆర్ఎస్వీ నాయకులు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, సీఎం భారీ బహిరంగ సభ విజయవంతంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాత్ర ఎంతో ఉందని చెప్పారు. ప్రతిఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరిన ఫలితంగానే బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా భారీగా తరలివచ్చారన్నారు.
కొండగట్టు అభివృద్ధికి 100 కోట్లు, జగిత్యాల నియోజకవర్గానికి 10కోట్ల నిధులు మంజూరు చేస్తామని ప్రకటించడంపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయాల అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. అన్నదమ్ముల్లా కలిసున్న వారిని విడగొట్టేందుకే బీజేపీ మతం పేరిట చిచ్చు పెడుతున్నదని మండిపడ్డారు. కండ్లున్న కబోదులు కాంగ్రెస్ నాయకులని విమర్శించారు. అనంతరం మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్కు తిలకందిద్ది స్వాగతం పలుకడం చాలా సంతోషంగా ఉందన్నారు. సభలో ఆయన అమూల్యమైన సందేశమిచ్చారన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం అభివృద్ధి, సంక్షేమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నాయకత్వంలో ముందుందన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల ముకుందం, రైతుబంధు సమితి అధ్యక్షుడు నక్కల రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్వీ పట్టణాధ్యక్షుడు ఆరీఫ్, గుల్లపేట సర్పంచ్ జక్కుల తిరుపతి పాల్గొన్నారు.