మన్సూరాబాద్, డిసెంబర్ 6: అత్యాధునిక హంగులతో ఫతుల్లాగూడలో నిర్మిస్తున్న మహాప్రస్థానం పనులను త్వరితగతిన పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకొస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. బండ్లగూడ పరిధిలోని ఫతుల్లాగూడలో ఆరెకరాల స్థలంలో రూ.21 కోట్లతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల కోసం వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్న పనులను ఆయన ఆయా మతాల ప్రతినిధులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ, ముస్లిం, క్రైస్తవుల కోసం వేరు వేరుగా నిర్మిస్తున్న మహాప్రస్థానం నగరానికి ఆదర్శంగా నిలువనున్నదన్నారు.
బ్రాహ్మణులు అపరకర్మలు చేసుకునేలా వారి కోసం అదనంగా భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. మహాప్రస్థానంలో పచ్చదనాన్ని పెంపొందించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. శ్మశానవాటికల్లో స్నానాల గదులు, మూత్రశాలలతోపాటు అంత్యక్రియలను ప్రజలు వీక్షించేలా సిట్టింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు నెలల్లో పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఎస్ఈ పరంజ్యోతి, డీఈ వెంకటరమణ, ఆర్కిటెక్ రాజశేఖర్, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ ప్రభాకర్, హర్టికల్చర్ అధికారి విజయభాస్కర్, మాజీ కార్పొరేటర్లు చెరుకు సంగీత, ముద్రబోయిన శ్రీనివాస రావు, జీవీ సాగర్రెడ్డి, భవానీ ప్రవీణ్కుమార్, రమావత్ పద్మానాయక్, నాగోల్, మన్సూరాబాద్ డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి, జక్కిడి మల్లారెడ్డి, నాయకులు జగదీశ్ యాదవ్, చెరుకు జంగయ్య గౌడ్, శ్రీధర్గౌడ్, అరవింద్ రెడ్డి, సత్యంచారి, వరప్రసాద్ రెడ్డి, రాహుల్ గౌడ్, రవికుమార్ పాల్గొన్నారు.