గువాహటి, నవంబర్ 8: మిజోరాం మంత్రులకు హిందీ అసలు రాదని, కొందరికి ఇంగ్లిష్ కూడా రాదంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరం తంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మిజో భాష తెలియని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రేణూ శర్మను మార్చాలని కోరారు. మొన్నటి వరకు సీఎస్గా లాల్నుమవియా చౌగో పనిచేశారు. ఆయన పదవీ విరమణ తర్వాత కేంద్రం రేణూ శర్మను నియమించింది. అయితే అప్పటికే అదనపు సీఎస్ జేసీ రామతంగాను తదుపరి సీఎస్గా బాధ్యతలు చేపట్టాలని కోరినట్టు సీఎం తన లేఖలో తెలిపారు. దాంతో మిజోరాంకు ప్రస్తుతం ఇద్దరు సీఎస్లు ఉన్నారు. ‘మిజో ప్రజలకు హిందీ రాదు. నా మంత్రులెవరికీ కూడా హిందీ అర్థం కాదు. కొందరు మంత్రులకు ఇంగ్లిషుతోనూ సమస్యే. ఈ పరిస్థితుల్లో మిజో భాష తెలియని సీఎస్ సమర్థంగా పనిచేయలేర’ని లేఖలో వివరించారు.