గజ్వేల్ రూరల్, మార్చి 10: తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ పథకం ఒక అద్భుతమని తమిళనాడు ఇంజినీర్ల బృందం ప్రశంసించింది. తమిళనాడుకు చెందిన 25 మంది వాటర్ రిసోర్స్ ఇంజినీర్లు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కోమటిబండ మిషన్ భగీరథ ప్రాజెక్టును సందర్శించారు. గోదావరి నది నుంచి నీటిని కోమటిబండకు తీసుకొచ్చిన విధానం, గ్రామాల్లోని ప్రతి ఇంటికి రెండు విడతలుగా నీటి సరఫరా, శుద్ధిచేసే పద్ధతులను మిషన్ భగీరథ ఈఈ రాజయ్య, డీఈ నాగార్జున వారికి వివరించారు. కోమటిబండ వద్ద నిర్మించిన ట్యాంకు ద్వారా ఎన్ని సెగ్మెంట్లకు నీటిని అందిస్తున్నారో తెలిపారు. ఈ ప్రాజెక్టును పరిశీలించిన బృందం సభ్యులు.. మిషన్ భగీరథ పథకంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదో అద్భుత కార్యక్రమం అంటూ కొనియాడారు.