అశ్లీలత, అసభ్యతకు తావులేని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని చెప్పింది మిషానారంగ్. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘మిస్సింగ్’. శ్రీని జోస్యుల దర్శకుడు. భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరిరావు నిర్మించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానున్నది. మంగళవారం హైదరాబాద్లో మిషానారంగ్ మాట్లాడుతూ ‘మీనా అనే జర్నలిస్ట్గా నా పాత్ర శక్తివంతంగా ఉంటుంది. ఓ యువతి అదృశ్యం వెనకున్న కారణాలేమిటో అన్వేషిస్తుంటా. హీరో లక్ష్యసాధనకు అండగా నిలుస్తుంటా. గ్లామర్ హంగులకు దూరంగా అభినయప్రధానంగా నా పాత్ర సాగుతుంది. కథానాయికగా నేను అంగీకరించిన తొలి సినిమా ఇది. కానీ ‘తెల్లవారితే గురువారం’ ముందుగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆదిసాయికుమార్తో ఓ సినిమా చేస్తున్నా’ అని పేర్కొన్నది. నికీషా రంగ్వాలా మాట్లాడుతూ ‘కెనడాలో పుట్టిపెరిగాను. తెలుగులో ఇదే నా తొలి సినిమా. ఇందులో శృతి అనే అమ్మాయిగా నేను కనిపిస్తా. గౌతమ్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శృతి అనూహ్యంగా కనిపించకుండా పోతుంది. ఆమెను కిడ్నాప్ చేసిందెవరు? భర్త గౌతమ్ గురించి శృతి తెలుసుకున్న వాస్తవాలేమిటన్నది ఉత్కంఠభరితంగా ఉంటుంది. సస్సెన్స్, థ్రిల్లర్, కుటుంబ విలువలతో సినిమాను రూపొందించాం. ప్రస్తుతం హాలీవుడ్, పంజాబీ భాషల్లో సినిమాలు చేస్తున్నా’ అని చెప్పింది.