జహీరాబాద్ ఫిబ్రవరి 14: మైనర్పై లైంగికదాడి చేసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి హుగెల్లి గ్రామ శివారులోని మామిడి తోటలో ఓ బాలికపై లైంగికదాడి చేసి హత్య చేశారు.
ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఓ మైనర్( 17) ఇంట్లో నుంచి బయటకు వెళ్లిందని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, రాత్రి బయటికి వెళ్లిన బాలిక ఇంటికి తెల్లవారే వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఉదయం గ్రామం చుట్టు పక్కల పోలాల వద్ద వెతకడం ప్రారంభించారు. గ్రామ సమీపంలో ఉన్న ఓ మామిడితోటలో బాలిక నిర్జీవంగా పడి ఉంది.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ రాజశేఖర్ పట్టణ ఎస్ఐ శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. మైనర్ పై లైంగికదాడి చేసి హత్య చేశారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆ రోజు రాత్రి బాలిక సెల్ ఫోన్ లో ఎవరితో మాట్లాడింది.. ఎవరు ఫోన్ చేశారు అనే సమాచారం సేకరిస్తున్నారు.