జబల్పూర్: మనిషి అన్నవాడు ఎవడైనా స్నేహితుడి కూతురు తనకూ కూతురు లాంటిదే అని భావిస్తాడు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ జిల్లాలో మానవత్వానికి, స్నేహానికి మచ్చతెచ్చే దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనారిటీ కూడా తీరని స్నేహితుడి కుమార్తెపై రెండు మానవమృగాలు అఘాయిత్యానికి ఒడిగట్టాయి. 11 ఏండ్ల బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో స్నేహితుడి ఇంట్లో చొరబడి ఆమెపై అత్యాచారం చేశారు.
జబల్పూర్ జిల్లాలోని రాంజీ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా ఈ నెల 11న వెలుగుచూసింది. అఘాయిత్యాన్ని చూసిన పక్కింటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు బాలిక ఇంటికి చేరుకుని ఆరా తీశారు. ఘటన జరిగినప్పటి నుంచి భయంతో వణికిపోతున్న బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి ఘటన గురించి ఆరా తీశారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల్లో ఒకని వయసు 25 ఏండ్లు, మరొకని వయసు 26 ఏండ్లు ఉన్నదని జిల్లా అదనపు ఎస్పీ సంజయ్ అగర్వాల్ తెలిపారు. బాధితురాలు తండ్రితోపాటు నిందితులిద్దరూ కూలీలుగా పనిచేసేవారని, ఈ క్రమంలోనే తండ్రి లేని సమయం చూసి బాలికపై అఘాయిత్యం చేశారని తెలిపారు. నిందితులపై పోక్సో చట్టంతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.