లక్నో : కఠిన చట్టాలు తీసుకువచ్చినా కామాంధుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. యూపీలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. దళిత బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన దుండగులు ఆపై బాలికను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక మృతదేహాన్ని గురువారం రాత్రి ఓ వ్యవసాయ క్షేత్రంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బాలిక ముఖంపై గాయాల గుర్తులున్నాయని పోలీసులు తెలిపారు. బాలిక తండ్రి పిర్యాదు ఆధారంగా హత్యాచార కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ముగ్గురు నిందితుల్లో ఓ నిందితుడు బాలిక పొరుగింట్లో ఉంటాడని, మరో నిందితుడు సమీప గ్రామానికి చెందిన వ్యక్తి కాగా మూడో నిందితుడు బాలికకు పరిచయస్తుడని పోలీసులు తెలిపారు.
సామూహిక లైంగిక దాడి అనంతరం బాలికను ఊపిరాడకుండా చేసి నిందితులు హత్య చేశారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని చెప్పారు. ఇక గుజరాత్లోని నర్మదా జిల్లాలో జరిగిన మరో ఘటనలో మైనర్ బాలికను స్కూల్ భవనం వెనుక లైంగిక వేధింపులకు గురిచేసిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 31 రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.