కామారెడ్డి : సీఎం కేసీఆర్ మేధో మథనం నుంచి పుట్టిందే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి
అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..పల్లెలు, పట్టణాలు బాగు చేసుకోవాడనికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి ఆదర్శవంతమైనా కార్యక్రమం లేదన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా గ్రామ, పట్టణాలకు నిధులు ఇస్తున్నది సీఎం కేసీఆర్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. పల్లెలకు ప్రభుత్వం ఇలా అదనపు నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు జూన్ 3 నుంచి 18 వరకు 4వ విడత పల్లె ప్రగతి,3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇందులో ప్రధాన భూమిక పోషించాలని మంత్రి సూచించారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణలో ఈ ఏడాది వరకు 7.5 శాతం పచ్చదనం పెరిగిందన్నారు. దేశంలో ఎక్కడా గ్రీనరీ ఇంతలా పెరగలేదన్నారు.
దేశంలో అటవీ విస్తీర్ణం పెంచడం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. కేవలం తెలంగాణలోనే రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంపు పై దృష్టి సారించిందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి,సంరక్షించే ప్రోత్సాహించాలన్నారు. అలాగే జూన్3వ తేదీ లోపు గత ఏడాది ప్రణాళికలో మిగిలిన పనులపై అవగాహన చేసుకుని వాటిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విఠల్ రావు, ఎమ్మెల్యే గణేష్ గుప్తా, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి ఉన్నారు.