హైదరాబాద్ : గృహ నిర్మాణశాఖపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు సొంత స్థలాల్లో గృహ నిర్మాణాలకు రూ.3లక్షలు ఆర్థిక సాయం అందించేందుకు 2022-23 బడ్జెట్లో నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. పథకం మార్గదర్శకాలు రూపొందించేందుకు, క్షేత్రస్థాయిలో అమలుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు మంత్రి సన్నాహక సమావేశం నిర్వహించారు. త్వరితగతిన మార్గదర్శకాలు రూపొందించి, సొంత స్థలాల్లో చేపట్టే గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం ప్రగతిపై మంత్రి ఆరా తీశారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఎస్ఈ బలరాం, ఓఎస్డీ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.