హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణ రంగ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన మినిస్టర్స్ క్వార్టర్స్లో వర్సిటీ ఏర్పాటు ప్రక్రియపై న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతితో చర్చించారు. నిర్మాణ రంగం బలోపేతానికి, నిపుణులైన కార్మికుల కొరతను అధిగమించడానికి వీలుగా నిర్మాణ రంగ వర్సిటీని స్థాపించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని మంత్రి వేముల చెప్పారు. ‘ఈ వర్సిటీ ద్వారా జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో టెక్నాలజీ విద్య అందుతుంది. ఇందులో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, రిసెర్చ్ విద్యను బోధిస్తారు. కొత్త రిసెర్చ్ కోర్సులు కూడా ప్రవేశపెట్టొచ్చు. దీని ద్వారా నిర్మాణ రంగ ఇంజినీర్లు, నిపుణులు, సైంటిస్టులు ఎంతో మంది తయారవుతారు. తెలంగాణతోపాటు దేశ నిర్మాణ రంగ వ్యవస్థలోనే వారు కీలకం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం సకల సౌర్యాలతో, నూతన టెక్నాలజీకి తగిన ప్రమాణాలతో హైదరాబాద్లోని 46 ఎకరాల విస్తీర్ణం ఉన్న న్యాక్ ప్రాంగణంలో 12 ఎకరాల్లో వర్సిటీ ఏర్పాటును పరిశీలిస్తున్నాం’ అని మంత్రి వేముల వివరించారు.