కమ్మర్పల్లి, మార్చి 29: రాష్ట్రంలో పండిన వడ్లను కేంద్ర ప్రభుత్వంతో కొనిపిస్తావా.. లేదంటే మాతో కలిసి కేంద్రంపై పోరాడతావా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సవాల్ విసిరారు. నిజామాబాద్ జిల్లాలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని మంగళవారం కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ జడ్పీ హైస్కూల్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘మీరు వరి వేయండి.. కేంద్రంతో వడ్లు కొనిపించే బాధ్యత నాది’ అని గతంలో రైతులను రెచ్చగొట్టిన బండి సంజయ్ మాటలను మంత్రి గుర్తుచేశారు.
బండి సంజయ్ ఆనాడు చెప్పిన మాటలను మైక్ ద్వారా సభలో అందరికీ వినిపించారు. ‘సంజయ్ వడ్లు పండినయ్.. ఇప్పుడు కేంద్రంతో కొని చూపించు’ అని సూచించారు. కేంద్రం కొనేలా ఆర్డర్ తీసుకొస్తే రాష్ట్రం సహకారం అందిస్తుందని స్పష్టంచేశారు. లేదంటే ఉగాది నుంచి మేము చేసే పోరాటంలో కలిసి రావాలని హితవు పలికారు. తెలంగాణ వాళ్లను అవమానించిన ఉమ్మడి ఏపీ సీఎంకిరణ్కుమార్, పలువురు నాయకులకు పట్టిన గతే.. రేపు బీజేపీ నాయకులకు పడుతుందని కేంద్రమంత్రి గోయల్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో 26 వేల పాఠశాలలను రూ.7,200 కోట్లతో ఈ కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు అందించే కార్యక్రమం ప్రారంభం అవుతుందని మంత్రి తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ నిధుల విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు.