హుజూరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది కాబట్టి గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తే ప్రభుత్వం గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. ఆయన మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలం మామిడాలపల్లి, గొల్లపల్లి, ఎలబాక, ఘన్ముకుల, మల్లన్నపల్లి, బ్రహ్మాణపల్లి గ్రామాల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోపాటు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ..70ఏండ్ల నుంచి జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరిగిందని అన్నారు. కులవృత్తులకు చేయూత అందించిన ప్రభుత్వం టీఆర్ఎస్ అని చెప్పారు. గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ, రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ. 5 వేల ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ,
బీజేపీ నేతలు విమర్శలు మాని ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అభివృద్ధి పనులు కొనసాగాలంటే బలహీన వర్గాల బిడ్డ గెల్లు శ్రీనివాస్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజల్ని కోరారు.