హైదరాబాద్: అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన గొప్ప దార్శనికుడు గాంధీజీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మహాత్ముని స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో విగ్రహావిష్కరణ ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. మహాత్ముడి జయంతి రోజున బాపూజీని స్మరించుకోవడం మనందరి బాధ్యతన్నారు.
ఆదివారం ఉదయం 10.30 ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారని చెప్పారు. అనంతరం గాంధీ దవాఖాన ముందు ఏర్పాటు చేసిన 16 ఫీట్ల బాపూజీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారని వెల్లడించారు. తర్వాత దవాఖాన ప్రాంగణంలో సభలో సీఎం పాల్గొంటారని తెలిపారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.