బన్సీలాల్పేట్, డిసెంబర్ 6 : పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. సోమవారం సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్పేట్ డివిజన్ చాచానెహ్రూనగర్లో నిర్మించిన 264 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేసేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు చేపట్టిన ప్రత్యేక బస్తీ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా బస్తీ ప్రజలందరి సమక్షంలోనే అర్హులను గుర్తించి ఇండ్లను కేటాయించడం జరుగుతున్నదని స్పష్టం చేశారు.
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, కలెక్టర్ శర్మన్ల సమక్షంలో అధికారులు లబ్ధిదారులను ఒక్కొక్కరిగా పేర్లతో పిలిచి ఇతను మీ బస్తీ వాసేనా.. అని స్థానిక ప్రజలను అడిగి అర్హుడిగా నిర్ధారణ చేశారు. బస్తీలో నివసించే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు కేటాయిస్తామని మంత్రి ప్రకటించారు. లబ్ధిదారులపై ఒక్క పైసా కూడా భారం పడకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వమే ఉచితంగా ఇండ్లను నిర్మించి ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి, తాసీల్దార్ బాలశంకర్, హౌసింగ్ ఈఈ వెంకట్దాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జి.పవన్కుమార్గౌడ్, కె.లక్ష్మీపతి, బస్తీ అధ్యక్షుడు అచ్చా నర్సింగ్రావు, డి.సుదర్శన్బాబు, వై.సురేశ్కుమార్, విజయ్శంకర్, శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పట్ల బస్తీవాసులు హర్షం ప్రకటించారు. గతంలో ఎన్నడూ కూడా ఇంత బాగా జరగలేదన్నారు. బస్తీవాసుల సమక్షంలో ప్రతి ఒక్కరినీ వేదికపైకి పిలిచి అందరు అంగీకారం తెలిపిన తర్వాతే ఇండ్లు కేటాయించడం చాలా బాగుందని ప్రశంసించారు. అభ్యంతరాలు, తిరస్కరించిన వారి పేర్లు, కారణాలతో సహా జాబితాలను నోటిసు బోర్డుపై అందుబాటులో ఉంచారన్నారు. అర్హులైన లబ్ధిదారుల జాబితా కూడా సర్వే అనంతరం ప్రజల సమక్షంలో ప్రదర్శించి, నోటిసు పెడతామని అధికారులు తెలిపారు.