బేగంపేట్ డిసెంబర్ 6: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. అమ్మవారి గర్భగుడికి వెండి తాపడం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు. మంత్రి తలసాని మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఊరేగింపునకు రథాన్ని చేయించాలని, అలాగే, బంగారు చీరను చేయించాలని సమావేశం సందర్భంగా నిర్ణయించారు. భక్తులు చెల్లించిన బంగారంతో అమ్మవారికి బోనం చేయించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావిస్తూ, లక్షలాది మంది భక్తుల రాకతో ఎంతో అభివృద్ధి చెందిన అమ్మవారి ఆలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.