హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో యాభై ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేసిందో చెప్పాలి. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజలు గుర్తుకొస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) విమర్శించారు. గురువారం సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి ప్రచారానికి స్థానిక ప్రజలు మంగళహారతులు, డప్పు చప్పుళ్లు, బతుకమ్మలతో ఘాన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ..గతంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు.
50 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేసి చూపెట్టామన్నారు. ప్రజల కష్టాల సుఖాల్లో పాలు పంచుకోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికల సమయంలో మాయమాటలతో మన మధ్యకు వస్తున్నారు. అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.