రాబోయే యాసంగి నుంచి బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయబోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంలో నిప్పు రాజేసింది. తెలంగాణలో యాసంగిలో పండేవి బాయిల్డ్ రైస్ మాత్రమే. వాటిని ‘కొనం’ అని ప్రకటించడమంటే, ‘యాసంగిలో ఒక్క ధాన్యపు గింజ కూడా కొనుగోలు చేయం’ అని స్పష్టం చేసినట్లే. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విపరీత పరిణామాలకు కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయమే కారణం.
పౌర సరఫరాల కోసం దశాబ్దాలుగా కేంద్రం భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ద్వారా దేశంలోని వివిధ రాష్ర్టాల్లో పండే వరి ధాన్యం సేకరిస్తూ వస్తున్నది. చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు కేంద్రం దొడ్డు వడ్ల సాగును ప్రోత్సహిస్తూ వస్తున్నది. పరోక్షంగా సన్న వడ్ల కన్నా దొడ్డు వడ్లకు అధిక ధర ఇస్తున్నది. సన్నవడ్ల దిగుబడి తక్కువ, పంటకాలం ఎక్కువ. సాగు ఖర్చులు ఎక్కువ. దొడ్డు వడ్లు దిగుబడి ఎక్కువ, పంటకాలం తక్కువ. సన్నవడ్లలో తరుగు ఎక్కువ. దొడ్డు వడ్లలో తరుగు తక్కువ. అందుకే మిల్లర్లు సన్నవడ్ల కన్నా దొడ్డు వడ్ల మీద మక్కువ చూపుతున్నారు.
దీంతోపాటు ఎంత పండితే అంత సేకరించేవారు. దీంతో రైతాంగం దొడ్డు రకాలకే ప్రాధాన్యం ఇచ్చారు. దీనికి తోడు ఉత్తరాదిన, ముఖ్యంగా పంజాబ్లో వానకాలం వరి, యాసంగిలో గోధుమ సాగు చేస్తారు. దక్షిణాదిన తెలంగాణలో గత ఏడేండ్లలో మారిన పరిస్థితుల నేపథ్యంలో యాసంగి వరిసాగులో దొడ్డు రకాలనే సాగుకు మొగ్గు చూపుతున్నారు. అధిక ఊష్ణోగ్రతల మూలంగా సన్నరకాలు సాగు చేస్తే నూక, తాలు శాతం అధికంగా ఉంటుంది. అందుకే దొడ్డు రకాలు సాగు చేస్తారు. వాటిని బాయిల్డ్ రైస్గా ఎగుమతి చేయడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో హఠాత్తుగా కేంద్రం నిర్ణయం రైతాంగానికి అశనిపాతంగా మారింది.
2014లో రాష్ట్రం ఆవిర్భవించే నాటికి వానకాలం, యాసంగి కలిపి 49.63 లక్షల ఎకరాల్లో ఉన్న వరి సాగు, 2021 నాటికి కోటి 6 లక్షల ఎకరాలకు చేరింది. ఈ వానకాలంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయడం గమనార్హం. తెలంగాణ నుంచి యాసంగి వరి ధాన్యం గతంలో తమిళనాడు, కేరళలకు 25 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఎగుమతి అయ్యేది. ఆ రాష్ర్టాలు వినియోగించేది బాయిల్డ్ రైస్ కావడంతో ఎఫ్సీఐ తెలంగాణలో ధాన్యం సేకరించి ఎగుమతి చేసేది. తమిళనాడు, కేరళలలో కొన్నాళ్లుగా స్థానికంగా వరి ధాన్యం ఉత్పత్తి పెరిగింది. వారి అవసరాలకు సరిపడా వారే పండించుకుంటున్నారు. దీంతో తెలంగాణ ధాన్యం ఎగుమతికి కేంద్రం ప్రత్యామ్నాయం ఆలోచించాల్సి ఉండగా, దాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా రైతాంగం ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేందుకు సమయం కూడా ఇవ్వకుండా ధాన్యం సేకరించమని ప్రకటించడం దుర్మార్గం.
యాసంగికి సంబంధించి బాయిల్డ్ రైస్ మాత్రం కొనబోమని చెప్పామని కేంద్రం డొంక తిరుగుడు వాదన చేస్తున్నది. అసలు బాయిల్డ్ రైస్ విధానమే కేంద్రం విధించిన క్వింటాలుకు 67 శాతం ఔట్ టర్న్ నిబంధన మూలంగా వచ్చింది. వానకాలం క్వింటాలుకు 66 నుంచి 69 కిలోల వరకు వివిధ రకాల ధాన్యం ఔట్ టర్న్ వస్తుంది. తెలంగాణలో పండే యాసంగి ధాన్యం కేవలం 50 నుంచి 55 కిలోలు మాత్రమే ఔట్ టర్న్ వస్తుంది. ఈ నేపథ్యంలో వానకాలానికి, యాసంగికి ఔట్ టర్న్ విధానంలో కేంద్ర నిబంధనలు సవరించుకోవాల్సింది పోయి, ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పడం సరికాదు.
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు లేక, కరంటు రాక తెలంగాణ రైతాంగం అన్ని విధాలా నష్టపోయింది. అందుకే తెలంగాణ ఆవిర్భవించిన వెంటనే దాదాపు 60 శాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగం మీద దృష్టి సారించిన సీఎం కేసీఆర్ ఈ రంగానికి ప్రోత్సాహం ఇచ్చి అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వ సాయంతో వ్యవసాయం వదిలి వలసబాట పట్టిన రైతాంగం తిరిగి వ్యవసాయం చేపట్టి ఇప్పుడిప్పుడే ఫలితాలను అనుభవించడం మొదలైంది. అయితే సాగునీటి రాక, పెరిగిన వరి సాగు నేపథ్యంలో భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలను, కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత విధానాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే పసిగట్టినట్లున్న ది. అందుకే మూడేండ్ల కిందటే రాష్ట్రంలో పంటకాలనీల ఏర్పాటు దిశగా ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను, వ్యవసాయ నిపుణులను ఆదేశించారు.
వరికి ప్రత్యామ్నాయంగా నూనె, పప్పుగింజల పంటల సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. 2024-25 నాటికి రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకొని ముందుకుసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో పత్తి, కంది, మినుములు, పెసలు, నువ్వులు తదితర పంటల సాగువైపు రైతాంగం మొగ్గు చూపుతున్నారు. గతేడాది సీఎం కేసీఆర్ పిలుపుతో 2 లక్షల ఎకరాలు మాత్రమే ఉన్న కంది సాగు, 10 లక్షల ఎకరాలకు చేరింది. వరి సాగు తగ్గించి రైతులను ఇతర పంటల వైపు మళ్లించాలని ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకుసాగుతున్నది.
దశాబ్దాలుగా సాగునీరు లేక, సర్కారు సహకారం లేక చితికిపోయిన తెలంగాణ రైతులు కొత్తగా వచ్చిన సాగునీటితో అధికశాతం వరి సాగుకే మొగ్గుచూపారు. దానికితోడు యాసంగిలో తెలంగాణలో దొడ్డురకాల సాగుకే అనుకూలమైన నేపథ్యంలో హఠాత్తుగా తెలంగాణ వరి ధాన్యం కొనబోమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం తెలంగాణ రైతాంగానికి అశనిపాతమే. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలని, గత నాలుగు నెలలుగా తెలంగాణ వ్యవసాయ మంత్రి, పౌరసరఫరాల మంత్రి, పరిశ్రమల మంత్రి, అధికారులతో పాటు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా కేంద్రం నిర్ణయంలో మార్పులేదు సరికదా కనీస స్పందన కనిపించడం లేదు!
కేంద్రం వైఖరి ఈ విధంగా ఉంటే, రాష్ట్ర బీజేపీ నేతలు యాసంగిలో వరినే పండించాలని రైతులను రెచ్చగొడుతున్నారు. ఈ నేపథ్యంలో యాసంగిలో పండే వరి ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రాన్ని ఒప్పించాలని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ నేతలను డిమాండ్ చేస్తున్నది. కానీ ఆ విషయం మీద స్పందించకుండా ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్న చందంగా టీ బీజేపీ వ్యవహరిస్తున్నది. పైగా వానకాలం ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రాల మీద దాడులు చేస్తూ పుండు మీద కారం చల్లుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయబోమని స్పష్టంగా చెప్తుంటే రాష్ట్ర బీజేపీ దానికి భిన్నంగా వ్యవహరిస్తూ తెలంగాణ రైతులను నట్టేట ముంచేందుకు కుట్రలు చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానమే ప్రస్తుత సమస్యకు కారణం. 2014, ఆగస్టు 20న మోదీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన శాంతకుమార్ కమిటీ 2015లో నివేదిక ఇస్తూ కేంద్రానికి పలు సూచనలు చేసింది. ఎఫ్సీఐని పటిష్టం చేయడం, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, నిల్వ, కనీస మద్దతుధర విధానం
సమీక్షించేందుకు ఈ కమిటీ ఏర్పాటుచేశారు.
దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరల విధానం వరి, గోధుమల సాగుకు మాత్రమే అనుకూలంగా ఉందని, రైతులను ఆ దిశగా ప్రోత్సహిస్తుందని కమిటీ తేల్చిచెప్పింది. దేశంలో పప్పు ధాన్యాలు, నూనెగింజల కొరత ఉన్నదని, దీన్ని అధిగమించాలంటే పంటల సాగుకు మద్దతు ధరతో ప్రోత్సాహకాలు ఇవ్వాలని, వంద శాతం పంటలు కొనుగోలు చేయాలని, లేనియెడల పంటల వైవిద్యీకరణ సాధ్యం కాదని కమిటీ స్పష్టం చేసింది.
అయితే కేంద్రం వివిధ రాష్ర్టాల్లో పండిన పంటలలో కేవలం 20 నుంచి 50 శాతం మాత్రమే మద్దతు ధరలకు కొంటామని ఖరాఖండిగా చెప్తున్నది. ఈ ఏడేండ్లలో వివిధ పంటలను మద్దతు ధర కింద వంద శాతం కొనేందుకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం అనేక సార్లు కేంద్రానికి లేఖలు రాసింది. అప్పటికీ కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో రైతుల పరిస్థితిని గమనంలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వమే నష్టాలు భరిస్తూ మార్క్ఫెడ్ వంటి సంస్థల ద్వారా వంద శాతం పంటలు కొనుగోలు చేసిన సందర్భాలు అనేకం.
ఎఫ్సీఐ కేవలం ఆహార ఉత్పత్తులు సేకరించి
నిల్వ చేయడమే కాకుండా బఫర్ స్టాక్
నిల్వలు ఎక్కువైనప్పుడు దేశీయ బహిరంగ
మార్కెట్లో గానీ, విదేశీ ఎగుమతుల ద్వారా
గానీ బఫర్ నిల్వలు తగ్గించి రైతులకు పంట సాగులో ఇబ్బందులు లేకుండా చూడాలి.
దేశీయ అవసరాల కోసం వంటనూనెల
దిగుమతి కోసమే సాలీనా రూ.70 వేల కోట్ల నుంచిలక్ష కోట్లు వెచ్చించడం జరుగుతున్నది.
దేశ వాణిజ్య విధానంలో ఉన్న లోపాల కారణంగా ఇతర దేశాల నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు మన దేశ మార్కెట్లో లభించే వ్యవసాయ ఉత్పత్తుల మద్దతుధర కన్నా తక్కువగా ఉండటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితి తలెత్తకుండా వాణిజ్య పాలసీని, కనీస మద్దతు ధరల పాలసీని అనుసంధానం చేయాలని కేంద్రానికి సూచించింది. కానీ ఇప్పటివరకు కేంద్రం తన విధానాలను సమీక్షించుకోలేదు. రైతుల పంటల ఉత్పత్తి, సగటు దిగుబడులు పెరగాలంటే తప్పనిసరిగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పింది. శాంతకుమార్ కమిటీ ఇంత స్పష్టంగా చెప్పినా కేంద్రం పట్టించుకోలేదు. రాష్ర్టాలకు కనీస సహకారం అందించడం లేదు. కేవలం మద్దతు ధరలను ప్రకటించి చేతులు దులుపుకొంటున్నది.
ఎఫ్సీఐ నిల్వలు బహిరంగ మార్కెట్కు తీసుకెళ్లకుండా, నిల్వలు తగ్గించకుండా తమ వద్ద నిల్వలు పేరుకుపోయాయని కేంద్ర మంత్రి ప్రకటించడం గమనార్హం. వీరి అపరిపక్వ విధానాల మూలంగా సామాన్య రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఆఫ్రికా దేశాల్లో పారా బాయిల్డ్ రైస్ వినియోగం ఎక్కువగా ఉంది. వారికి సరిపడనంత నిల్వలు, ఉత్పత్తులు లేవు. దేశం నుంచి ఎగుమతులు చేసేందుకు కేంద్రానికి మాత్రమే అవకాశం ఉంది. కానీ ఎఫ్సీఐ ద్వారా ఎగుమతులు చేయడంలో, అంతర్జాతీయ అవసరాలు పసిగట్టడంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదు. రైతే ఈ దేశానికి వెన్నెముక.
ప్రపంచం సాంకేతికంగాఎంత ఎత్తుకు ఎదిగినా శాస్త్రవేత్తలు ఎన్ని అద్భుతాలు సృష్టించినా మనుషులు తినే ఆహారం మాత్రం మట్టి నుంచి రావాల్సిందే. అది రైతు చెమటచుక్కలతో తడవాల్సిందే. ఈ ప్రపంచంలో అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. ఆహారానికి ప్రత్యామ్నాయం లేదు. అలాంటి రైతు సమస్య విషయంలో కేంద్రం స్పందించాలి. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లే వరకు వెసులుబాటు కల్పిస్తూ వెంటనే తెలంగాణ రైతులు పండించే యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వంం ఉత్తర్వులు జారీచేయాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి)