వేములవాడ రాజరాజేశ్వరస్వామి సన్నిధానంలో ఏటా మూడు రోజులపాటు గడపడం వారికి సెంటిమెంట్. ఎప్పటిలాగే స్వామివారిని దర్శించుకునేందుకు గురువారం సాయంత్రం కారులో సంతోషంగా బయలుదేరిన వారిని రోడ్డు ప్రమాదం కబళించింది. దీంతో రెండు కుటుంబాల్లో పెనువిషాదాన్ని నింపింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల పేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ఉన్న ఏడుగురిలో నలుగురు అక్కడికక్కడే, ఒకరు దవాఖానలో మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతులంతా ములుగు జిల్లా ఏటూరునాగారం వాసులుకాగా, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఎల్కతుర్తి/ఏటూరునాగారం, డిసెంబర్ 22: వారంతా అన్నదమ్ముల కుటుంబ సభ్యులు.. వేముల వాడకు వెళ్లి రాజరాజేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు కారులో బయలుదేరారు. కానీ, ఇంతలోనే వారిని మృత్యువు కబళించింది. దైవసన్నిధికి చేరకముందే మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు దవాఖానలో మృతి చెందగా, ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. గురువారం అర్ధరాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం వారి కుటుంబాల్లో పెనువిషాదాన్ని నింపింది. ఎల్కతుర్తి ఎస్సై రాజ్కుమార్ కథనం ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన మంతెన కాంతయ్య (72), మంతెన శంకర్ (60) వరుసకు అన్నదమ్ములు. కాంతయ్య, అతడి భార్య రేణుక(55), కూతురు చందన (16), మంతెన శంకర్, అతడి భార్య శ్రీదేవి, కుమారులు భార్గవ్, భరత్ (29) ఈ రెండు కుటుంబాలు కలిసి వేములవాడకు కారులో గురువారం సాయంత్రం బయలుదేరాయి. వీరిలో కారు నడుపుతున్న భరత్ అయ్యప్ప మాల ధరించి ఉన్నాడు. సంతోషంగా దైవదర్శనానికి బయలుదేరిన రెండు కుటుంబాలను అర్ధరాత్రి మృత్యువు కబళించింది. సుమారు 2గంటల ప్రాంతంలో ఎల్కతుర్తి మండలంలోని పెంచికలపేట సమీపంలో ఎదురుగా గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు వెళ్తున్న లారీ, కారు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయి రోడ్డు కింది వైపునకు దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భరత్తోపాటు అతడి తండ్రి శంకర్, మంతెన కాంతయ్య, అతడి కూతురు చందన తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీటులో కూర్చున్న రేణుక, శ్రీదేవి, భార్గవ్ తీవ్ర గాయాలతో కారులోనే ఇరుక్కుపోయారు. విషయం తెలుసుకున్న ఎల్కతుర్తి సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై గోదారి రాజ్కుమార్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదాన్ని పరిశీలించారు. కారులో ఇరుక్కున్న క్షతగాత్రులు రేణుక, శ్రీదేవి, భార్గవ్ను బయటకు తీసి,108 వాహనంలో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ రేణుక మృతి చెందింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ట్రాక్టర్లో ఎంజీఎం మార్చురీకి తీసుకెళ్లారు.
కాజీపేట ఏసీపీ డేవిడ్రాజ్, సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారి రాత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. మృతుల బంధువు కట్కూరి విజయ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజ్కుమార్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ఏటూరునాగారం మండల కేంద్రంలోని వారి ఇంటికి తరలించారు. మృతదేహాలను చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. శుక్రవారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, మృతుడు మంతెన కాంతయ్య కమ్మరి పని, అతడి కూతురు చందన ఎనిమిదో తరగతి చదువుతోంది. మృతుడు శంకర్ ప్లాట్ల వ్యాపారం, భరత్ టీఎస్ఎండీసీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడడం, మరో ఇద్దరు గాయపడిన ఘటనపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమశాఖల మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.