హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): మన ఊరు-మన బడి పథకాన్ని అత్యంత ప్రాధాన్యత గల కార్యక్రమం (ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం) గా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం, అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, మౌలిక వసతుల కల్పన ఈ పథకం ఉద్దేశాలు. ఈ పథకం ద్వారా మూడేండ్లలో మూడు దశల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తారు. రాష్ట్రంలో మొత్తం 26,065 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, తొలి విడతలో భాగంగా 2021-22 విద్యా సంవత్సరంలో 9,123 స్కూళ్లను అభివృద్ధి చేయనున్నారు.
మండలాన్ని యూనిట్గా తీసుకొని అన్ని రకాల (ప్రాథమిక, మాద్యమిక, ఉన్నత) పాఠశాలల్లో అత్యధికంగా ఎన్రోల్మెంట్ నమోదైనా 9,123 (35% సూళ్లలో 65% విద్యార్థులను కవర్ చేస్తూ) ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో ముందుగా కార్యక్రమం అమలుచేస్తారు. ఈ పథకం అమలుకు రూ.7,289.54 కోట్లు అవసరం కాగా తొలి విడతలో రూ.3,497.62 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఎంపిక చేసిన పాఠశాల్లో చేపట్టే కార్యక్రమాల అమలుకు అన్ని అనుమతులను జిల్లా కలెక్టర్లు ఇస్తారు. పాఠశాల నిర్వహణ కమిటీ(ఎస్ఎంసీ)లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తారు.
ఈ కమిటీలకు దశలవారీగా నిధులను విడుదల చేస్తారు. నిధుల సమీకరణకు ఆర్థికశాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. సాంకేతిక అంశాలను రాష్ట్ర ఐటీ విభాగం పర్యవేక్షిస్తుంది. ఈ పథకం అమలు తీరుతెన్నులపై గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్ఫరెన్సీ (ఎస్ఏఏటీ) అనే సంస్థ ద్వారా సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. ప్రతి సూల్లో పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటుచేస్తారు. ఇందులోని ఇద్దరు క్రియాశీలక సభ్యులు, సర్పంచ్, ఇద్దరు పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. దాతలు ఇచ్చే నిధులు, సీఎస్సాఆర్ ద్వారా వచ్చే నిధులు తదితర మార్గాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు.
మన ఊరు-మన బడి కింద ప్రతి పాఠశాలలో పటిష్టం చేయనున్న 12 విభాగాలు
నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపోయే ఫర్నిచర్, పాఠశాల మొత్తం పెయింటింగ్ వేయడం, పెద్ద, చిన్న మరమ్మతులు చేపట్టడం, గ్రీన్చాక్ బోర్డుల ఏర్పాటు, ప్రహరీ గోడల నిర్మాణం, కిచెన్ షెడ్లు నిర్మాణం, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూంల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్హాల్స్ ఏర్పాటు, డిజిటల్ విద్య అమలు
క్యాబినెట్ నిర్ణయంతో స్కూళ్లకు మహర్దశ
‘మన ఊరు.. మన బడి’ పథకంతో సర్కారు స్కూళ్లకు మహర్దశ పడుతుందని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సోమవారం క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆమె ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. పాఠశాలల అభివృద్ధికి రూ.7,289 కోట్లు వెచ్చించడం చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. త్వరలోనే మొదటి విడతలో భాగంగా 35 శాతం బడుల అభివృద్ధికి, రూ.3,497 కోట్లను ఖర్చు చేయబోతున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి సర్కారు స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం బోధన, ఫీజుల నియంత్రణకు చట్టం, కోఠి మహిళా కాలేజీలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు అంశాలపై క్యాబినెట్లో చర్చించి, సానుకూలంగా స్పందించడం పట్ల సీఎం కేసీఆర్కు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ విద్యావ్యవస్థను దేశంలో అగ్రభాగాన నిలబెడుతామని చెప్పారు.