బడంగ్పేట, డిసెంబర్ 7: అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లోని మైత్రిపురంలో రూ.40లక్షలతో కమ్యునిటీహాల్, సీసీ రోడ్డు పనులకు మంగళవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని కాలనీలకు తాగునీటి సరఫరా సంవృద్ధిగా అందించడానికి సీఎం కేసీఆర్ రూ.1250 కోట్లు మంజూరు చేశారని అన్నారు. పైపులైన్స్, రిజర్వాయర్స్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.
మహేశ్వరం నియోజకవర్గానికి రూ.212 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం మీర్పేటలో మూడు రిజర్వాయర్ల నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి సామార్థ్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మొదటి దశలో వేసిన పైపులైన్లు కాకుండా రెండవ దశలో వేస్తున్న తాగునీటి పైపులైన్ల ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ తాగునీటి సరఫరా చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అన్నారు.
నాలాల పునరుద్ధరన చేయడానికి, చెరువులను అనుసంధానం చేయడానికి ప్రభుత్వం రూ.880 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి రూ.110 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు. అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. ఔట్లెట్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, మీర్పేట కమిషనర్ సీహెచ్ నాగేశ్వర్, డీఈ గోపీనాథ్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
మహేశ్వరం, డిసెంబర్ 7: మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం తుక్కుగూడ మున్సిపాలిటీ టీఆర్ఎస్ మహిళా విభాగం నూతన కమిటీ సభ్యులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజకీయంగా మహిళలకు అత్యధిక ప్రాముఖ్యనిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ మహిళల భద్రతకు షీ టీంలను ఏర్పాటు చేసి వారికి రక్షణ కల్పిస్తుందని అన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి మహిళకు చేరే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు జిల్లెల లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి, మహిళా అద్యక్షురాలు వెలిగొండ పద్మా భాస్కర్రెడ్డి, ఉపాధ్యక్షురాలు పొన్నమోని శ్రీలత, ప్రధాన కార్యదర్శి భవానీ మౌనిక, కార్యవర్గ సభ్యులు చిట్టి తిరుపతమ్మ, బుజ్జమ్మ, శ్రీవిద్య, శ్రీలత, మమత, అరుణ, భారతి, లక్ష్మి, మాధవి, ఐలమ్మ, లక్ష్మమ్మ, పాల్గొన్నారు.
ఆర్కేపురం, డిసెంబర్ 7 : తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏబీసీడీ వర్గీకరణ కోసం చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్శర్మ, నాయకులు రుద్రాల స్వామి, కొండ్ర శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.