మహేశ్వరం ( హైదరాబాద్ ) : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabita reddy) అన్నారు. బుధవారం మహేశ్వరం గ్రామంలోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 15 మంది నాయకులు , వార్డు సభ్యుడు వీరబాబు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆమె మాట్లాడుతూ నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు బీఆర్ఎస్(BRS)లో చేరుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలో ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. నియోజక వర్గంలో వేల కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు వివరించారు. నియోజక వర్గంలో ఇంకా అభివృద్ధి చెందాలంటే మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్లో చేరిన వారికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని అన్నారు. పార్టీలో చేరిన వారు కల్లెం వంశీ, భరత్ నాయక్, శ్రీకాంత్ గౌడ్, హరీశ్, గనీ, హన్మంతు, మహేశ్, శ్రీకాంత్ పటేల్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆనందం, సీనియర్ నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, మినాజ్పటేల్, మునగపాటి నవీన్, గ్రామ శాఖ అధ్యక్షుడు దుడ్డుక్రిష్ణయాదవ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలో విస్తృత ప్రచారం
కందుకూరు(హైదరాబాద్) : మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం మండల పరిధిలోని దావుద్గూడ, పెద్దమ్మతండ, పులిమామిడి, దన్నారం, చిప్పలపల్లి, మురళీనగర్,బాచుపల్లి, జైత్వారం, కొత్తగూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలకు మోస పూరితమైన వాగ్దానాలు చేస్తున్నారని వారి మాటలను నమ్మి మోసపోరాదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలనను అందిస్తున్నారని చెప్పారు.