అమరావతి : జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్పై ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. మచిలీపట్నంలో ఆయన టాలీవుడ్ సినీ నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, బన్నీ వాసుతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి నాని స్పందించారు. చిరంజీవి తనకు ఫోన్ చేశారని, సినిమా ఫంక్షన్ సంఘటనపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని తెలిపారు. పవన్ వ్యాఖ్యలతో మేం ఏకీభవించమని అన్నారని, సినిమా ఫంక్షన్లో జరిగిన పొరపాటుతో ఇండస్ట్రీకి సంబంధం లేదని అన్నారని చెప్పారు.
ఆన్లైట్ టికెటింగ్ కొత్తగా పెట్టింది కాదని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వం కొత్త ప్రవేశపెట్టింది కాదని, సినీ పరిశ్రమ ఆన్లైన్ టికెట్ బుకింగ్కు అనుకూలంగా ఉందని చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఒక వ్యక్తి వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఏకాభిప్రాయంగా తీసుకోబోమని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. కిరాయికి రాజకీయ పార్టీ పెట్టింది పవన్ కల్యాణేనని, రాజకీయ పార్టీని టెంట్హౌస్లా అద్దెకిస్తున్నారని విమర్శించారు.
అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ సినిమా రంగం చాలా సున్నితమైందన్నారు. సినీ సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని, పరిశ్రమను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు. ఎవరో ఏదో మాట్లాడితే తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.