హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ ) : ప్రమాదాల నివారణ కోసం రాత్రి సమయాల్లో వాహనాలు స్పష్టం గా కనిపించడం కోసం రెక్ట్రో రిఫ్లెక్టివ్ టేప్ (రేడియం స్టిక్కర్) అతికించడం తప్పనిసరి. దీన్ని వాహనదారుల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్య త రవాణా శాఖపై ఉంటుంది. ఫలితంగా రాత్రి వేళలో ప్రమాదాలు తగ్గుముఖం పడుతాయి. కానీ ఆర్టీఏ తీరు ఇందుకు విరుద్ధంగా ఉన్నది. ప్రమాదాల నివారణ లక్ష్యాన్ని పక్కకు పెట్టి ఏజెన్సీలకు ఆదాయం కట్టబెట్టే నిర్ణయా లు చేసింది. రేడియం స్టిక్కర్లంటేనే బెంబేలెత్తేలా ధరలు పెంచింది. గతంలో రూ.100 లోపు స్టిక్కర్ ధర ఉంటే ఇప్పుడు ఆ ధరలు ఆకాశన్నంటాయి. గతంలో ఒక్క ఆటోకు రేడియం స్టిక్కర్ వేయాలంటే రూ.80 మాత్ర మే ఖర్చయ్యేది.
కానీ ఇప్పుడు రూ.500 వసూలు చేస్తున్నారు. వాహనదారులపై పన్ను ల భారం పెంచడమే లక్ష్యంగా తీసుకుంటున్న రవాణా శాఖ నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు లైఫ్ట్యాక్స్, సర్వీస్ చార్జీ, ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్ ధరలు, రోడ్డు సెస్ పెంచిన ఆర్టీఏ తాజాగా రేడియం స్టిక్కర్ల ధరలు కూడా పెంచడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఫిట్నెస్లు నిలిపివేశారు. పాత స్టిక్కర్లు ఉన్న వాహనాలు కూడా నిర్ణీత గడువులో క్యూఆర్ కోడ్ ఉన్న స్టిక్కర్లను అతికించుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ స్టిక్కరింగ్ను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంపై వాహన సంఘాల జేఏసీ నాయకులు మారయ్య, సత్తిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రవాణా కార్యాలయానికి వచ్చే ప్రతి వాహనానికీ ముందుగా కొలతలు తీస్తున్నారు. ఆ తర్వాత స్టిక్కర్ వేస్తున్నారు. ఫొటోలు తీస్తున్నారు. ఫీజు చెల్లింపు లు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇవ్వన్నీ పూర్తయ్యాకనే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. ఈ తతంగం అంతా ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రైవేట్ ఏజెన్సీలే నడుపుతున్నాయి. కాగా, మీటర్కు రూ.150 చొప్పున స్టిక్కర్ చార్జీ విధిస్తున్నారు. వాహన పరిమాణం ఎంత ఉంటే అంత మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. చిన్న వాహనానికి రూ.2 వేల వరకు ఖర్చవుతుండగా, పెద్ద వాహనాలకు రూ.9 వేల వరకు బిల్లు పడుతున్నదని వాహనదారులు వాపోతున్నారు. ప్రైవేట్ ఏజెన్సీల ప్రవేశంతో స్థానికుల ఉపాధిపై దెబ్బపడింది.
