హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నర్సంపేట్లో మిరప పరిశోధన కేంద్రం ఏర్పాటుపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. మిరప పరిశోధన కేంద్రం ఏర్పాటు కోసం వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ ద్వారా భూమి బదిలీ ప్రక్రియలో ఉందన్నారు. వ్యవసాయ పంటల అభివృద్ధి కోసం రాష్ర్టంలో నిరంతరంగా పరిశోధనలు జరుగుతున్నాయి.
అందులో భాగంగానే వరికి బాన్సువాడలో, మక్కలకు కరీంనగర్లో పరిశోధన కేంద్రం ఉంది. కందులకు తాండూరు ప్రాంతంలో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు పరిశీలన ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. వనపర్తిలో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చింది. మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు నర్సంపేట్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మిర్చికి అంతర్జాతీయ డిమాండ్ ఉండటంతో ఇక్కడ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని వ్యవసాయ నిపుణులు కోరుతున్నారు. భూమి బదిలీ ప్రక్రియ జరిగిన వెంటనే తదుపరి చర్యలను చేపట్టేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.