కల్వకుర్తి/ చారకొండ, అక్టోబర్ 3: రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ పాలకులకు సవాల్ విసిరారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని 6 గ్రామాలకు చెందిన దళితబంధు లబ్ధిదారులకు సోమవారం జూపల్లి గ్రామంలో 305 యూనిట్లను ఎంపీ రాములు, టీఆర్ఎస్ జడ్పీ చైర్పర్సన్ పద్మావతి, జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, కలెక్టర్ ఉదయ్కుమార్, ఎమ్మెల్సీ కశిరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి మంత్రి పంపిణీ చేశారు.
మంత్రి మాట్లాడుతూ.. సామాజిక వివక్షకు గురై, ఆర్థిక ఇబ్బందులతో అష్టకష్టాలు పడిన దళిత బిడ్డలకు సామాజిక ప్రేరణగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టి అమలు చేస్తున్న ధీశాలి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. దేశాన్ని సంపదలో అగ్రగామిగా నిలిపేందుకు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న క్రమంలో ఆయనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.