శామీర్పేట, డిసెంబర్ 13 : ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాలు సుందరంగా మారాయన్నారు. రూ.80 లక్షల వ్యయంతో జగ్గంగూడ, కొల్తూర్, అనంతారం, నారాయణపూర్, పోతారం, ఉద్దెమర్రి, ఆద్రాస్పల్లిలో సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ముదిరాజ్భవన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశామన్నారు.
అంతకు ముందు మూడుచింతలపల్లి మండల కేంద్రంలో ప్రత్యేక నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఎంపీపీ హరికమురళీ గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, ఎంపీడీవో పద్మావతి, తాసీల్దార్ రాజేశ్వర్రెడ్డి, ఎంపీవో రవి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అనిల్రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.