సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరానికి పుష్కలంగా నీళ్లు అందించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు దూరదృష్టితో బృహత్తర ప్రాజెక్టులను చేపడుతున్నారని, 2051నాటికి సరిపడా నీళ్లు అందించేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసి పనులు చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న 20కి పైగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో తాగునీటి వ్యవస్థను అందించేందుకు సుమారు రూ.6వేల కోట్లను ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
సోమవారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అలాపూర్ టౌన్ షిప్లో ఓఆర్ఆర్ ఫేజ్ 2లోని ప్యాకేజ్ – 2 పనులకు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చెవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేతో ప్రకాష్ గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… దేశంలోనే వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ ముందుందని, మన నగరానికి ఉన్న భౌగోళిక, వాతావరణ అనుకూల పరిస్థితుల కారణంగా వేగంగా విస్తరించడంతో పాటు జనాభా పెరుగుతోందన్నారు. నగర ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందన్నారు. మొదటి దశలో జీహెచ్ఎంసీ పరిధిలో రూ.2 వేల కోట్లతో మెరుగైన నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ అంటే మొత్తం ఓఆర్ఆర్ పరిధిగా తాము భావిస్తున్నామని, అందుకే ఈ ప్రాంతంలో కూడా తాగునీటి సమస్య పరిషారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఓఆర్ఆర్ పరిధిలో మొదటి విడతలో రూ.775 కోట్లతో తాగు నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు ఫేజ్ – 2లో భాగంగా ఏకంగా రూ. 1,200 కోట్ల నిధులతో ఓఆర్ఆర్ పరిధి మొత్తానికి తాగునీటిని అందించే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
978 కాలనీలకు..
జీహెచ్ఎంసీ పరిధి బయట ఔటర్ రింగు రోడ్డు పరిధిలో విస్తరించిన గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు నీటి సరఫరా చేసేందుకుగానూ ఇన్లెట్, అవుట్లెట్, సరఫరా వ్యవస్థ ఏర్పాటు, సర్వీస్ రిజర్వాయర్ల నిర్మాణం పనులు పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి ద్వారా ఔటర్ రింగు రోడ్డు పరిధిలో ప్రజలకు సరిపడా నీటి సరఫరా జరగనుంది. ఇప్పటి వరకు నీటి సరఫరా లేని ప్రాంతాలకు నీటిని అందించనున్నారు. ప్రస్తుతం మూడు రోజులకు, అంతకంటే ఎక్కువ రోజులకు ఒకసారి నీటి సరఫరా అవుతున్న పలు ప్రాంతాలకు రోజూ విడిచి రోజు నీటిని అందించనున్నారు. ముఖ్యంగా సరఫరా వ్యవస్థలో సరిపడా ప్రెషర్ ఉండడంతో లోప్రెషర్ సమస్య పరిష్కారం కానుంది. కాగా ప్రస్తుత అవసరాలు తీర్చడంతో పాటు 30 ఏళ్ల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని 2051 వరకు ఉండే అవసరాలను తీర్చేలా ఈ పనులు జరుతుండడం, అందులో ప్రతి మనిషికి 150 ఎల్పీసీడీ నీరు లక్ష్యంగా చర్యలు తీసుకుంటుండడం గమనార్హం.
ప్రతి ఇంటికి నీరు
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలికసదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి పనులకు రూపకల్పన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలన్న కలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. ఇంటింటికీ నీళ్లందించడమే ప్రధాన లక్ష్యంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ధైర్యంగా నిర్ణయం తీసుకుని రాజేంద్రనగర్ నియోజకవర్గానికి రూ.200 కోట్ల నిధులను కేటాయించడం సంతోషంగా ఉంది.
మార్చిలోనే ఓఆర్ఆర్ -2 మొదటి ఫలాలు
ఈ ఏడాది మార్చిలోనే ఓఆర్ఆర్ ఫేజ్-2 మొదటి ఫలాలు అందించనున్నాం. తొలుత 272 కాలనీల్లో నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకుగానూ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నాం. ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, వీటి పరిధిలోని గృహ లేఅవుట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటిని అందించేందుకు రూ.1200 కోట్లతో చేపట్టిన పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేస్తాం.
మహానగరంతో సమానంగా నిధులు
నగర శివారు ప్రాంతాల ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యలను పరిష్కరించడమే రాష్ట్ర సర్కారు ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. నగర శివారు ప్రాంతాల అభివృద్ధి విషయంలో పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. మంత్రి చొరవతో ఇప్పటికే శివారు మున్సిపాలిటీలు, గ్రామాలకు కోట్లాది నిధులను కేటాయించి మహానగరంతో సరిసమానంగా నిధులను కేటాయిస్తున్నారు. శివారు ప్రాంతాల ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రతిపాదనలను రూపకల్పన చేస్తున్నారని అందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి మున్సిపాలిటీ గ్రామాలకు తాగునీటిని అందించేందుకు రూ.1200కోట్లను ప్రతిపాదనలు చేపట్టడం సంతోషంగా ఉంది.