సిటీబ్యూరో, జనవరి 24(నమస్తే తెలంగాణ)/దుండిగల్: హైదరాబాద్ మహా నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. వేల కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరాభివృద్ధికి అన్ని రంగాల్లోనూ చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే మంగళవారం పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కుత్బుల్లాపూర్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం, శంకుస్థాపనలు చేయనున్నారు.
గాజుల రామారం ఫారెస్ట్ బ్లాక్లో ప్రాణ వాయువు అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. గాజుల రామారం, సూరారం, బౌరంపేట పరిధిలోని 454 హెక్టార్లలో ఈ పార్కును పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దారు. సుందరీకరణ పనుల్లో భాగంగా ఆకర్షణీయంగా ప్రవేశ ద్వారం, కూర్చొని సేద తీరేలా గాజిబో, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, వాష్ రూమ్స్, మెగా షెడ్, చిల్డ్రన్ పార్కు ఏరియా, రెండు ఓపెన్ క్లాస్ రూమ్లు, పిక్నిక్ ఏరియా ఇలా ప్రత్యేకతలతో పార్కును తీర్చిదిద్దారు. స్థానికులు, పరిసర ప్రాంతవాసులకు ఈ పార్కు ఎంతగానో దోహదపడనుంది. ఈ పార్కుతో పాటు వార్డు నంబరు 128 చింతల్లోని భగత్సింగ్ నగర్లో సకల హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించి అందుబాటులోకి తీసుకురానున్నారు. గాజుల రామారంలో స్పోర్ట్స్ పార్కును ప్రారంభించడంతో పాటు మరో రెండు చోట్ల పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. బాచుపల్లి ఫ్లై ఓవర్ వద్ద రహదారి విస్తరణ పనులను, జీడిమెట్ల హర్ష దవాఖాన వద్ద ఎస్ఎన్డీపీ పనులు, ఎస్టీపీ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
పర్యటన వివరాలు..