హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): హిజాబ్ వివాదంపై కర్ణాటక అట్టుడుకుతున్నది. దేశవ్యాప్తంగా ఈ విషయంపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. దీనిపై ‘సిలికాన్ వ్యాలీ నుంచి సాఫ్రాన్ వ్యాలీ వరకు కర్ణాటక గురించే చర్చ జరుగుతున్నది’ అంటూ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అభిషేక్ భక్షి ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ‘ఈ విషయంలో నేను చాలా కలవరపడ్డాను. కానీ వీళ్ల నేర విధానం అందరికీ తెలిసిందే. దేశంలో మతపరమైన ఉద్రిక్తత ఉంది అంటే.. ఎక్కడో ఎన్నికలు ఉన్నాయని అర్థం చేసుకోండి’ అంటూ ట్వీట్ చేశారు.