బ్రాహ్మణ సంఘాల సమ్మేళనంలో ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ రమణాచారి, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ తదితరులు
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛమైన మనసుతో ప్రజలకు సేవచేయాలన్న సంకల్పంతోనే మాజీ ప్రధాని వీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు. నిగర్వి, చదువుల తల్లి అయిన వాణీదేవిని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్లంతా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆమె గెలుపు పీవీకి మనమిచ్చే గౌరవంగా భావించాలని సూచించారు. బ్రాహ్మ ణ సంఘాల సమాఖ్య అధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ దోమలగూడలోని పింగళి వెంకట్రామిరెడ్డి హాలులో జరిగిన సమన్వయ సమ్మేళనంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి వ్యక్తిత్వంపై మాట్లాడేందుకు విపక్షాలకు ఒక్క మాటకూడా లేదని, ఆమె వ్యక్తి త్వం అంత మహోన్నతమైనదని మంత్రి కేటీఆర్ అన్నారు. విమర్శించడానికి ఏమీలేకపోవడంతో ఆమె ను రాజ్యసభకో, ఎమ్మెల్సీకో నామినేట్ చేయాల్సిందని ఉచిత సలహాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. పీవీ ప్రజాక్షేత్రం నుంచే గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టారని, అదేవిధంగా వాణిదేవిని గెలిపించుకొని చట్టసభలకు పంపాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. వాణీదేవి ఎల్లప్పుడూ పీవీ వెంట ఉంటూ దేశదేశాలు తిరిగిన ఉన్నత విద్యావంతురాలని.. అయినా ఏమాత్రం దర్పం లేకుండా ఉంటారని కొనియాడారు. ఆమెకు పదవి అవసరం లేకున్నా సీఎం కోరిన వెంటనే ప్రజలకు సేవకు అంగీకరించారని తెలిపారు.
బీజేపీ అభ్యర్థి రామచందర్రావుకు ప్రజలు ఒకసారి అవకాశమిచ్చినా ప్రశ్నించే గొంతుకగా చెప్పుకొనే ఆయన చట్టసభల్లో ఏమి ప్రశ్నించారని కేటీఆర్ నిలదీశారు. ‘ఐటీఐఆర్ను కేంద్రం రద్దుచేస్తే ఎందుకు ప్రశ్నించలేదు? కాజీపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వబోమన్నప్పుడు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాకుండా చేసినప్పుడు, సిలిండర్ ధర రూ.414 నుంచి రూ.870కి పెరిగినప్పుడు, నీతి ఆయోగ్ రాష్ర్టానికి రూ.24,000 కోట్లు ఇవ్వాలని చెప్తే కేంద్రం పైసా ఇవ్వనప్పుడు ఎం దుకు ప్రశ్నించలేదు? అని నిలదీశారు. ప్రజలకు సేవ చేస్తున్నవారిని కాదని వ్యక్తిగత దూషణలకు దిగుతున్నవారి వార్తలనే మీడియా పతాక శీర్షికల్లో వేస్తున్నదని అసహనం వ్యక్తంచేశారు.
సీఎం కేసీఆర్ మాటల వ్యక్తి కాదని కేటీఆర్ అన్నా రు. 2003లోచంద్రబాబు సీఎంగా ఉండగా, గోదావరి పుష్కరాలను బాసర, భద్రాద్రి, ధర్మపురిలో ఎందుకు జరపరని కేసీఆర్ ప్రశించారని, దాంతోనే చంద్రబాబు ధర్మపురిలో పుష్కరస్నానం చేశారని చెప్పారు. కేసీఆర్ మొదటినుంచీ ధార్మికుడిగా ఉంటూ ధర్మాన్ని నిబద్ధతతో ఆచరించే వ్యక్తి అన్నారు. తెలుగు భాషపై ఇంత పరిజ్ఞానం ఉందంటే అది తన గురువు మృత్యుంజయశర్మ వల్లనేనని నేటికీ కేసీఆర్ సగర్వంగా చెప్పుకోవడమే కాకుండా అందరిముందూ గురువుకు ప్రణమిల్లుతారని అన్నారు.
బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో ఓ వృద్ధుడు అందరి దృష్టిని ఆకర్శించారు. ఓ వైపు సభ సాగుతుండగా మధ్యలో ఉపేందర్రావు అనే వ్యక్తి ‘కేసీఆర్ పిలుపు.. చదువులమ్మ గెలుపు’ అనే ప్లకార్డును ప్రదర్శించారు. ప్లకార్డుతో ఆ వ్యక్తి చేస్తున్న ప్రచారాన్ని వేదికపై నుంచి గమనించిన మంత్రి కేటీఆర్ పక్కనున్న అతిథులకు ఆ వృద్ధుడిని చూపించడంతో ఒక్కసారిగా మీడియా, సభికుల దృష్టంతా అతడిపైకి మళ్లింది. ఆ వృద్ధుడి ప్రచారానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపి అభినందించారు.
బ్రాహ్మణుల కోసం సంక్షేమ పరిషత్ ఏర్పాటుచేసి రూ.100 కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వివేకానంద ఓవర్సీస్ పథకం ద్వారా విదేశీ విద్య అభ్యసించే పేద బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ఇప్పటివరకు 386 మందికి లబ్ధి చేకూర్చినట్టు వివరించారు. వ్యాపారాలు చేసుకొనేవారికి 2 నుంచి 5 లక్షలవరకు గ్రాంటు రూపంలో ఇప్పటివరకు 2,391 మందికి అందజేసినట్టు చెప్పారు. గోపన్పల్లిలో బ్రాహ్మణ సదన్ను అతి త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. సూర్యాపేటలో బ్రాహ్మణ సదన్ నిర్మాణానికి రెండు కోట్లు కేటాయించామని వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమానికి బ్రాహ్మణులు బాసటగా నిలిచారని కేటీఆర్ గుర్తుచేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్చకులను రెగ్యులరైజ్ చేసి ట్రెజరీ ద్వారా ఒక్కొక్కరికి రూ.25,000 వరకు వేతనాలు ఇస్తున్నామన్నారు. అర్చకుల పదవీకాలాన్ని 65 ఏండ్లకు పెంచడమేకాకుండా 3,500 మంది అర్చకులకు ధూపదీప నైవేద్యాలకింద నెలకు రూ. 6,000 అందజేస్తున్నామని చెప్పారు. సామూహిక ఉపనయనాలకు అవకాశం కల్పించాలని, దేవాలయాల అభివృద్ధికి మరింత కృషి చేయాలని బ్రాహ్మణ సంఘాలు కోరుతున్నాయని, ఎన్నికల తర్వాత రమణాచారి అధ్యక్షతన సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని హామీఇచ్చారు.
బ్రాహ్మణ సమాజాన్ని పైకి తేవాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, ఆయనకు బలాన్ని చేకూర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. నేడు బ్రాహ్మణులు అస్థిత్వం కోల్పోయే ప్రమాదం ఏర్పడుతున్నదని, అలా జరుగకుండా కేసీఆర్ కాపాడుతున్నారని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ రమణాచారి చెప్పారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నామని పరిషత్ సభ్యుడు వేణుగోపాలచారి చెప్పారు. బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషిచేస్తున్నారని రాష్ట్ర బేవరేజెస్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ కొనియాడారు. ఒక సాధారణ గ్రామీణ పురోహితుడి కొడుకునైన తనకు కూడా పదవి ఇవ్వడమే బ్రాహ్మణులపట్ల కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ అన్నా రు. సంఖ్యాపరంగా తక్కువ ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చిన విధంగానే సంక్షేమంలో బ్రాహ్మణులకూ వాటా కల్పించారని ఎమ్మెల్సీ పురా ణం సతీశ్ ప్రశంసించారు.
వాణీదేవికి రాష్ట్రంలోని అన్ని బ్రాహ్మణ సంఘాలు ఒక్కతాటిన మద్దతు పలికాయి. ఆదివారం బ్రాహ్మణ సంఘాల సమాఖ్య సమన్వయ సమ్మేళనంలో పాల్గొన్న వివిధ సంఘాలనేతలు వాణికే తమ మద్దతు అని స్పష్టంచేశారు. వీరిలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు సువర్ణ సులోచన, సుమలతాశర్మ, మరుమాముళ్ల వెంకటరమణశర్మ, హనుమంతాచార్య, జోషి గోపాలశర్మ, తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహనశర్మ, చంద్రమౌళీశ్వర పరిషత్ అధ్యక్షుడు ఆదరాసుపల్లి శ్యాంమోహనశర్మ, అర్చక సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ, తెలంగాణ కరణం నియోగి సంఘం అధ్యక్షుడు బండారు రాంప్రసాదరావు, తెలంగాణ బ్రాహ్మణ సేవాసమితి అధ్యక్షుడు సుధాకరశర్మ, భాగ్యనగర అర్చక పురోహిత సంఘం అధ్యక్షుడు గట్టు శ్రీనివాసాచార్యులు, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు గంగు చైతన్య, మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి అధ్యక్షుడు మహాదేవభట్ల లక్ష్మణ ప్రసాదశర్మ, పరశురామ బ్రాహ్మణ సేవామిత్ర అధ్యక్షుడు నరేశ్ కులకర్ణి, బ్రాహ్మణ సేవావాహిని అధ్యక్షుడు రఘుకిరణ్ ఆచార్యులు, బ్రాహ్మణ స్త్రీశక్తి అధ్యక్షురాలు అనూరాధ, మన బ్రాహ్మణ సమాజం కార్యదర్శి అవధానుల ప్రసాద్, బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షుడు యజ్ఞం పవనకుమార్ శర్మ, వైష్ణవ సేవాసంఘం అధ్యక్షుడు ఎస్టీ చారి, బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ అధ్యక్షుడు మల్లాది చంద్రమౌళి, గ్రేటర్ హైదరాబాద్ బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు తులసి శ్రీనివాస్, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఉపాధ్యక్షుడు మంగపతిరావు తదితరులు ఉన్నారు.
బ్యాలెట్ పేపర్లో నాలుగవ నెంబర్ వద్ద నా పేరుకు ఎదురుగా ఒక్క గీత (ఒకటి అంకె) గీసి నా గీతను మార్చండి. బ్రాహ్మణుల గీతను మార్చేందుకు నేను కృషిచేస్తా. విద్యారంగంలో సేవలు అందిస్తున్నాను. ఎమ్మెల్సీగా అవకాశమిస్తే ఇంకా ఎందరికో సేవచేసే అవకాశం దక్కుతుంది. వంగరలో పుట్టి ఎర్రకోటపై జెండాను ఎగురవేశారు మా నాన్న. ధర్మ మార్గంలో కూడా ప్రజాసేవ చేయవచ్చని నిరూపించారు.
– వాణీదేవి, టీఆర్ఎస్ అభ్యర్థి