అంతర్జాతీయ కంపెనీల అడ్డాగా హైదరాబాద్ మారిపోతున్నది. ఇప్పటికే పలు గ్లోబల్ సంస్థలు ఇక్కడ ఆఫీస్ను ఏర్పాటు చేయగా.. తాజాగా ఈ జాబితాలో అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ స్ప్రింక్లర్ చేరింది. భాగ్యనగరంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సంస్థ సుముఖతను వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ న్యూయార్క్లో స్ప్రింక్లర్ కంపెనీ ప్రతినిధులతో శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఐటీ కంపెనీలకు కల్పిస్తున్న మౌలిక వసతులు, అందుబాటులో ఉన్న వనరులు, ఐటీ అభివృద్ధికి ఉన్న సానుకూల వాతావరణం తదితర అంశాలను ఈ సందర్భంగా వివరించారు. ఈ క్రమంలో తమ కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు స్ప్రింక్లర్ కంపెనీ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. తొలివిడతగా 200 మందికి ఉద్యోగావకాశాలను కల్పిస్తామని, దశలవారీగా వచ్చే మూడు నుంచి ఐదేండ్లలో ఈ సంఖ్యను 1,000కి విస్తరింపజేస్తామని మంత్రి కేటీఆర్కు కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు.