మేడ్చల్, జనవరి24(నమస్తే తెలంగాణ): పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పరిశ్రమల ఏర్పాటుతో వేల మందికి ఉపాధి లభించేలా పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు పోత్సాహం అందిస్తున్నది. మేడ్చల్ జిల్లా రావల్కల్లో 40.09 ఎకరాల స్థలంలో ఏర్పాటు కానున్న పారిశ్రామికవాడలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2.50 కోట్ల నిధులను మంజూరు చేసింది. పారిశ్రామికవాడలో భూమికి సంబంధించిన కన్వర్షన్ (బదాయిలంపు)కు హెచ్ఎండీఎకు చెల్లించాల్సిన రూ.85లక్షలను మాఫీ చేసింది.
మంజూరు చేసిన నిధులతో టీఎస్ఐఐసీ అభివృద్ధి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇందులో రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. రావల్కల్లో నవజీవన్ గీతానగర్ అసోసియేషన్ పేరిట పారిశ్రామికవాడను ఏర్పాటు చేసుకున్నారు. స్మూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవాడను ఏర్పాటు చేసుకుని అభివృద్ధికి నిధులు మంజూరుకు టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్కు విన్నవించడంతో నిధులను మంజూరు చేయించారు.
160 పరిశ్రమల ఏర్పాటు
రావల్కల్ నవజీవన్నగర్, గీతానగర్ పారిశ్రామికవాడలోని 160 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇదివరకు బాలనగర్లో ఉన్న కొన్ని పరిశ్రమలు రావల్కల్కు రాగా మరిన్ని నూతన పరిశ్రమలు నెలకోల్పనున్నారు. సుమారు 1600కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని తద్వారా 3వేల మందికి పరిశ్రమల్లో ఉపాధి లభించనున్నది.
మంత్రి కేటీఆర్ చొరవతోనే నిధులు మంజూరు
రావల్కల్ నవజీవన్నగర్, గీతానగర్ పారిశ్రామికవాడ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ చొరవతో రూ. 2.50కోట్ల నిధులు మంజూరయ్యాయి. అభివృద్ధిలో భాగంగా కన్వర్షన్(బదాలయింపు)కు హెచ్ఎండీఏకు చెల్లించాల్సిన రూ. 85 లక్షలను మాఫీ చేయించారు. త్వరగా పారిశ్రామికవాడలో అభివృద్ధి పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ టీఎస్ఐఐసీ అధికారులను ఆదేశించారు. పారిశ్రామికవాడ ఏర్పాటుతో చాలా మందికి యువతకు ఉపాధి లభించనున్నది.
-టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి, మర్రి రాజశేఖర్రెడ్డి
మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు
మేడ్చల్ జిల్లా రావల్కల్, నవజీవన్నగర్, గీతానగర్ పారిశ్రామికవాడ అభివృద్ధికి నిధులు మంజూరు ఇచ్చిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు. టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి మంత్రి కేటీఆర్ను అసోసియేషన్ సభ్యులతో కలిసి వెళ్లి నిధులు మంజూరి చేయాలని కోరాం. తక్షణమే నిధుల మంజూరుతో పాటు అభివృద్ధి పనులు జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.