సికింద్రాబాద్, జనవరి 25: కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నెలకొన్న సమస్యలపై శాశ్వత పరిష్కారం లభించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న టీపీటీ నిధుల విడుదలకు సైతం గ్రీన్సిగ్నల్ రానున్నట్లు తెలుస్తోంది. ఆదే విధంగా కంటోన్మెంట్లో ఉచిత తాగునీటి పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర సర్కారు ప్రకటన చేయనున్న నేపథ్యంలో నేడు ప్రగతి భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, మల్కాజిగిరి పార్లమెంట ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో పాటు బోర్డు మాజీ సభ్యులు, సీనియర్ నేతలతో కీలక సమావేశం జరగబోతున్నది.
నియోజకవర్గంలో రక్షణ శాఖ అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టే విధంగా ప్రణాళికను రూపొందించే అంశాలు చర్చకు వచ్చే వీలుంది. మరోవైపు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బోర్డు మాజీ సభ్యులతో కేటీఆర్ ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇటీవల కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న మద్దతుకు సంబంధించి నేతలతో ఆరా తీయనున్నట్లు సమాచారం. విలీనం అయితే బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలు జీహెచ్ఎంసీలో కలిస్తే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం అందే వీలు ఉండడంతో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
ఈ కీలక భేటీలో ప్యాట్నీ నాలా ఆధునీకరణకు సంబంధించి పనులను త్వరితగతిన ప్రారంభించే అంశంపై క్లారిటీ రానుంది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడి కంటోన్మెంట్లో ఉచిత తాగునీటి పథకం అమలుకు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. టీపీటీ నిధుల విడుదలకు మోక్షం కలగనున్నట్లు సమాచారం. దీంతో కంటోన్మెంట్లో తామున్నామనే భరోసాను టీఆర్ఎస్ కలిగించే విధంగా అడుగులు వేస్తుంది.