మంత్రి తలసానిపై కోమటిరెడ్డి అనుచిత వ్యాఖ్యల పట్లతీవ్రంగా మండిపడిన పురపాలకశాఖ మంత్రి కేటీఆర్
తలసానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అంటేనే కుంభకోణాల పార్టీ అని.. ఏ ఫర్ ఆదర్ష్.. బీ ఫర్ బోఫోర్స్.. సీ ఫర్ కామన్వెల్త్.. ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ల నుంచి పాతాళంలో ఉండే బొగ్గుదాక కుంభకోణాల్లో కూరుకుపోయిన దౌర్భాగ్యుల పార్టీ అని.. అలాంటి పార్టీకి చెందినవాళ్లు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరమని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు విరుచుకుపడ్డారు.
సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చసందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మంత్రి తలసానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సభ అదుపుతప్పింది. రాజగోపాల్రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ సభ్యులు డిమాండ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. తలసానికి క్షమాపణలు చెప్పకపోతే చర్యలు తీసుకోవాలని కోరారు ‘రాజగోపాల్రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఏందో.. వాళ్ల పార్టీ ఫ్రస్ట్రేషన్ ఏందో విచిత్రంగా ఉన్నది. సభ లోపల వీళ్లు బాధ్యతారాహిత్యంగా.. కుసంస్కారంగా మాట్లాడుతున్నారు. బయటేనేమో వాళ్ల పార్టీ అధ్యక్షుడి నోటికి హద్దు అదుపులేదు’ అని అన్నారు. కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం చెప్పబోగా ‘ఏమి ఆయన మీ పార్టీ కాదా.. వదిలేసుకొన్నారా? ఎట్లా మాట్లాడుతారు? ముఖ్యమంత్రి, సభా నాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడిని పట్టుకొని.. ఆయన జన్మదినం సందర్భంగా మా పార్టీ వాళ్లేదో సంబరాలు చేసుకొంటుంటే.. మూడు రోజుల సంతాపదినాలు జరుపుకోండని అడ్డంగా వాళ్ల పార్టీ మాట్లాడుతున్నది.
నిన్నగాక మొన్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయ్యాయి. 98 శాతం స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నరు. కేసీఆర్కు ఆరోగ్యపరమైన సమస్య వచ్చింది. చూయించుకోవడానికి దవాఖానకు వెళ్తే బీజేపీ వాళ్ల రిజల్ట్ చూసి.. కేసీఆర్ దవాఖానకు పోయిండని రాజగోపాల్రెడ్డి అంటడు. ఇదా వీళ్ల సంస్కారం. ఎంత కుసంస్కారంగా మాట్లాడుతున్నారు. పద్దుల మీద మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి’ అని కేటీఆర్ అన్నారు. ‘అవినీతి…అవినీతి అని మాట్లాడుతున్నారు.. ఏ పార్టీ అధ్యక్షా వీళ్లది.. అవినీతి మీద ఏమైన ఆధారాలుంటే ఇక్కడ గొంతు చించుకోవడం కాదు.. సీవీసీ ఉన్నది, ఏసీబీ ఉన్నది, విజిలెన్స్ ఉన్నది, కోర్టులున్నాయి. ఇక్కడ గొంతులు చించుకోవడం .. బట్టలు చించుకోవడం కాదు.’ అని గట్టిగా హితవు పలికారు. ‘మాట్లాడండి ఎవరు వద్దన్నరు. గాలి మాటలు మాట్లాడటం కాదు. ఒక బలహీనవర్గాలకు చెందిన మంత్రిని పట్టుకొని పేకాట ఆడుతుండని ఎట్లంటవు.. నాకర్థం కాదు. వ్యక్తిత్వాన్ని హననం చేయడం ఏందండి. నోటికి ఎంతొస్తే అంతనేనా. నోటికి హద్దు అదుపు లేదా? సభ్యుడు మా మంత్రికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. లేదంటే యాక్షన్ తీసుకోవాలి’ అని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
కాంట్రాక్టులపై రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలు..
సోమవారం అసెంబ్లీలో పద్దులపై చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్రెడ్డి తెలంగాణ ప్రభుత్వం అప్పులు తెచ్చి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసమేనని, కాంట్రాక్టులన్నీ ఆంధ్రోళ్లకు కట్టబెట్టారన్నారు. దీనిపై టీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య సంవాదం జరిగింది.తలసాని తనను కాంట్రాక్టర్ అని సంబోధిం చడంతో రాజగోపాల్రెడ్డి విచక్షణ కోల్పోయారు. మంత్రి తలసానిపై అనుచితంగా మాట్లాడారు. మంత్రి వేముల స్పందిస్తూ బీసీ మంత్రిని పట్టుకొని అనుచితంగా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజగోపాల్రెడ్డి ఉన్న వైపు వెళ్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్చేశారు. రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
మంత్రి వేముల లేచి వ్యాఖ్యలు తొలగించడం కాదు సర్ ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ సభ్యుడిని పట్టుకొని ఆ విధంగా ఎలా మాట్లాడుతారు. బేషరతుగా క్షమాపణ చెప్తేనే సజావుగా జరుగుతుందన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ నాలుగుసార్లు అవకాశమిచ్చినా ప్రతిసారి కాంట్రాక్ట్ సబెక్ట్ తప్ప మరేమి మాట్లాడటం లేదన్నారు. బీసీ మంత్రిని పట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? అని మంత్రి పువ్వాడ నిలదీశారు. అయినా అలాగే మొండిగా మాట్లాడటంతో.. మంత్రి వేముల లేచి.. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.. అంతా ప్రజలు గమనిస్తున్నారని, సభను నడిపించాలని స్పీకర్ను కోరారు.