హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్షపూరిత ధోరణి అవలంబిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఆవేదన వ్యక్తంచేశారు. పారిశ్రామిక కారిడార్ల మంజూరులో, ఐటీఐఆర్ ప్రాజెక్టు విషయంలో ఎన్నో విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పారు. చివరికి రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా ఇప్పటికీ అమలుచేయలేదని అన్నారు. అయినా, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి మెగా ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. సోమవారం హైదరాబాద్లో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించిన సదస్సులో మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-నాగ్పూర్, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్లు మంజూరు చేయాలని తెలంగాణ సర్కారు అనేకసార్లు విజ్ఞప్తి చేసిందని, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన కోసం తెలుగు రాష్ర్టాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని సైతం నెరవేర్చలేదని గుర్తుచేశారు. అయినా, కేంద్రంతో సంబంధం లేకుండా 19వేల ఎకరాల్లో ఫార్మాసిటీని, 1,200 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్పార్క్ను అభివృద్ధి చేశామన్నారు.
కేంద్ర సహకారం లేకున్నా..
కేంద్రం నుంచి ఆశించిన సహకారం లేకున్నా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. పెట్టుబడులకు మౌలిక సదుపాయాలు ఎంత ముఖ్యమో మానవ వనరులు కూడా అంతే ముఖ్యమని.. దానికోసం రాష్ర్టానికి ఐఐటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, కరీంనగర్లో ఐఐఐటీ, మెడికల్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయాలని కోరినా ప్రయోజనం లేదన్నారు. బుల్లెట్ రైలు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. దేశాభివృద్ధిలో తెలంగాణ తనవంతు పాత్ర పోషిస్తున్నదని అన్నారు. కేంద్రానికి తెలంగాణ చెల్లించిన ప్రతి రూపాయి తిరిగి రాష్ర్టానికి రావాలని తాము కోరుకోవటం లేదని, కనీసం సగమైనా రాష్ట్రానికి రావాలని పేర్కొన్నారు.
ఆర్బీఐ చెప్పిన నిజం ఇదీ..
దేశ జనాభాలో తెలంగాణ జనాభా రెండున్నర శాతమే. జీడీపీలో మాత్రం రాష్ట్ర వాటా 5 శాతంగా ఉందని ఇటీవల రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నదని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. భౌగోళికంగా 12వ, జనాభాపరంగా 11వ పెద్ద రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఎకానమీ కాంట్రిబ్యూషన్లో 4వ అతిపెద్ద రాష్ట్రంగా అవతరించినదని నివేదికలో పేర్కొన్నట్టు తెలిపారు. చిన్న రాష్ట్రంగా ఉన్నా దేశానికి ఆర్థికంగా ఎక్కువ సహకారం అందిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన టీఎస్ఐపాస్ను నేడు దేశవ్యాప్తంగా సింగిల్ విండో రూపంలో అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. టీఎస్ఐపాస్ అమల్లోకి తెచ్చాక రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి వచ్చాయని చెప్పారు. మేక్ ఇన్ తెలంగాణ పేరుతో ఆన్లైన్ మాల్ను సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీనివల్ల ఎంఎస్ఎంఈలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.