సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 1: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఔదార్యాన్ని చాటుకున్నారు. నిరుపేద విద్యార్థి ఐఐటీ విద్య పూర్తి చేసేందుకు రూ.2.20 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రగుడుకు చెందిన సిరిసిల్ల మల్లేశం-భవాని దంపతులకు ఇద్దరు కొడుకులు. గతంలో మల్లేశం మృతి చెందగా.. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ పరిస్థితి చూసి చలించిన మంత్రి.. మల్లేశం పెద్ద కొడుకు భరత్ను సిరిసిల్లలోనే ఓ ప్రైవేటు విద్యాసంస్థలో చేర్పించి చదివించారు. ఈ క్రమంలో భరత్ ఐఐటీ జేఈఈ (అడ్వాన్స్డ్)లో ఎస్సీ క్యాటగిరీలో 948వ ర్యాంక్ సాధించి ఉత్తరాఖండ్ కళాశాలలో సీటు సాధించాడు. స్థానిక నేతల సాయంతో భవాని మంత్రి కేటీఆర్ను కలిసి తన కుమారుడి చదువు విషయాన్ని విన్నవించగా భరత్ చదువుకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్కు పిలిపించి భరత్ చదువు కోసం రూ.2.20 లక్షలను అందజేశారు. కోరిన వెంటనే సాయం చేసిన మంత్రి కేటీఆర్కు భరత్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.