హైదరాబాద్: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్కి దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధును అమలుచేయించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. స్థానిక టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్నేత, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావుతో కలిసి ప్రెస్మీట్లో మాట్లాడారు. దళితబంధును వెంటనే అమలుచేయాలని బండి సంజయ్ అనడం హాస్యాస్పదమని అన్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ గత రెండు, మూడు రోజులుగా చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. దళితబంధు.. సీఎం కేసీఆర్ ఆలోచనతో దేశంలోనే తెలంగాణలో మొదటిసారిగా అమలవుతున్న పథకమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఫిర్యాదు వల్లే దళితబంధు నిలిచిపోయిందని చెప్పారు. ఈ పథకంపై మాట్లాడే అర్హత బండి సంజయ్కిగానీ, బీజేపీ నాయకులకుగానీ లేదన్నారు.
బండి సంజయ్కి దళితులపైన ప్రేమ ఉంటే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకురావాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. దళితులను మోసం చేస్తున్న పార్టీ బీజేపీ అని దుయ్యబట్టారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎక్కడా లేనివిధంగా మేనిఫెస్టో విడుదల చేశారని, కేంద్రంతో మాట్లాడి ఆ మేనిఫెస్టో అమలుచేసే బాధ్యత బండి సంజయ్దేనని అన్నారు. టీఆర్ఎస్ సర్కారు సంపదను పెంచి పేదలకు పంచుతుంటే.. బీజేపీ సర్కారు కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నదని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని లొట్టపీసు చట్టం అంటూ హేళన చేసిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ బీజేపీలో ఉన్నారని, ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఆ పార్టీకి దళితుల అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ది ఏంటో తెలుస్తున్నదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బాహాటంగా సహకరించుకోవడం వల్లే హుజూరాబాద్లో టీఆర్ఎస్ ఓటమి పాలయ్యిందని, తమ ఓటుబ్యాంకు చెక్కుచెదర్లేదని చెప్పారు. కాంగ్రెస్తో అనైతిక పొత్తువల్ల గెలిచిన ఈటల రాజేందర్ విర్రవీగుతున్నారని, ఇప్పుడే బీజేపీ రాష్ట్ర నాయకుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఫలితంపై పార్టీలో సమీక్ష చేసుకుంటామని చెప్పారు. అక్కడ ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని, హుజూరాబాద్లో ఓటమికి, సంక్షేమ పథకాలకు సంబంధం లేదన్నారు. బీజేపీ నేతలు ఇకనైనా అబద్ధాలు మాని రాష్ట్ర అభివృద్ధికి పనికొచ్చే పనులు చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ హితవుపలికారు.