Jagadish Reddy | సీఎం కేసీఆర్కు కుడిభుజంగా ఉన్నవాళ్లల్లో గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఒకరు. విప్లవ విద్యార్థి ఉద్యమాల్లో మమేకమై పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. న్యాయవాదుల సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో పురుడు పోసుకున్న నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ ఆవిర్భావ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన తెలంగాణ కోసం జరిగిన అన్ని ఉద్యమాల్లో కేసీఆర్ వెంట నడిచారు. జలసాధన ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. అలంపూర్ టూ ఆర్డీఎస్కు జరిపిన 45 రోజుల పాదయాత్రకు బ్రిగేడియర్గా వ్యవహరించారు.
జైలులోనే పండుగలు
రైతులకు విద్యుత్ను సక్రమంగా సరఫరా చేయాలని జగదీశ్రెడ్డి నేతృత్వంలో జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. 2002లో కుడి కాల్వకు సాగర్ నీటిని విడుదల చేసి, ఎడమ కాల్వను ఎండబెడితే నార్కట్పల్లి వద్ద మహిళలతో నిర్వహించిన రాస్తారోకో అప్పట్లో సంచలనం. ఈ ఘటనతో సమైక్యపాలకుల ఆగ్రహానికి గురయ్యారు. ఫలితంగా 9 రోజులు జైలు జీవితం గడిపారు. 2008లో ప్రణబ్ముఖర్జీ నిజామాబాద్ పర్యటన సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. అప్పట్లో టీఆర్ఎస్ కార్యకర్తలపై లగడపాటి రాజగోపాల్ దౌర్జన్యంగా కారు నడిపించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ మెరుపు ఉద్యమాన్ని చేపట్టింది. లగడపాటి రాజగోపాల్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా, నిరసనకు పోలీసులు అరెస్టు చేస్తే 15 రోజులు జైలులో ఉన్నారు. ఆయనకు దసరా, దీపావళి పండుగలు జైల్లోనే అయ్యాయి. సూర్యాపేటలో తెలంగాణ ఉద్యమకారులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని నాటి ఎమ్మెల్యే అనుచరులు కూల్చివేస్తే అందుకు ప్రతిగా భారీ ర్యాలీ నిర్వహించారు.
హ్యాట్రిక్ దిశగా అడుగులు
2014, 2018 ఎన్నికల్లో సూర్యాపేట నుంచి వరుస విజయాలు సాధించిన జగదీశ్రెడ్డి హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ తొలి విద్యాశాఖ మంత్రిగా కొంతకాలం పనిచేసిన ఆయన తరువాత నుంచి విద్యుత్శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని సీఎం కేసీఆర్ చేసిన శపథం, దాన్ని అమలు చేసేందుకు అధినేత కేసీఆర్ అప్పగించిన హోంవర్క్ క్రమం తప్పకుండా పూర్తి చేస్తారనే పేరు ఆయన సొంతం. అలాగే 2018 ఎన్నికల తరువాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికలల్లో జిల్లా మంత్రిగా వరుసగా వాటిని గెలిపించి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశారు. చేసే పనిపట్ల నిబద్ధ్దత… ఓర్పు… సహనం… నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతోపాటు తాను నమ్మినవారి పట్ల విధేయుడిగా ఉంటూ, తనను నమ్మిన వారిని అంతే కాపాడుకుంటారని జగదీశ్రెడ్డి పేరు తెచ్చుకోవటం విశేషం.