సూర్యాపేట : గ్రామ దేవతల ఆరాధనతో గ్రామాలు సుభిక్షంగా ఉంటున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో యాదవుల ఆరాధ్యదైవమైన గంగ దేవమ్మ పండుగకు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా పండుగలు చేసుకోవాలన్నారు.
అనంతరం సంప్రదాయ నృత్యాలు చేస్తున్న మహిళలు, యువకులతో కలిసి ఆడిపాడి సందడి చేశారు. బేరీ కొట్టి ఉత్సాహాన్ని నింపారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.