వేములవాడ: ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పట్టువస్త్రాలు సమర్పించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా మంత్రి అల్లోల స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనాలను అందించారు.
శివరాత్రి మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వారి దివేనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ కృష్ణభాస్కర్, ఆలయ ఈవో కృష్ణప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.