సిద్దిపేట బస్టాండ్ తెలంగాణ ఉద్యమానికి అడ్డా అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన మోడల్ బస్ స్టేషన్ను ఆదివారం ఆయన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ, సిద్దిపేట బస్టాండ్కు అప్పటి మంత్రి చొక్కారావు 1974-75లో శంకుస్థాపన చేశారని, అర్థ శతాబ్ద కాలంగా సేవలు అందించిందని తెలిపారు. ఆ రోజుల్లో పదుల సంఖ్యలో బస్సులు, వందల సంఖ్యలో ప్రజలు బస్టాండ్ సేవలను వినియోగించుకుంటే, ఇప్పుడు వందల సంఖ్యలో బస్సులు, వేల సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడినుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు వెల్లడించారు. సీఎస్ఆర్ నిధులతో ఈ బస్టాండ్ను నిర్మించామని, ఆర్టీసీ, ప్రభుత్వానికి అప్పగించామని మంత్రి హరీశ్రావు చెప్పారు.
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్న బీజేపీ..
కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వం రంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తున్నదని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రైల్వే, ఎల్ఐసీ.. ఇలా అన్నింటినీ కార్పొరేట్కు అంటగడుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీని మనం కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. ఆర్టీసీపై ఎంతో మంది కార్మికుల జీవితాలు ఆధారపడి ఉన్నాయన్నారు. టీఎస్సార్టీసీకి ప్రతి ఏటా సీఎం కేసీఆర్ 1500 నుంచి 3 వేల కోట్ల రూపాయలు ఇచ్చి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు ఈ బస్టాండులో వైద్యం అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిలో సిద్దిపేట నుంచి వివిధ ప్రాంతాలకు రైలు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. జాతీయస్థాయిలో సిద్దిపేట 46 అవార్డులను సొంతం చేసుకుందని, ప్రజాభాగస్వామ్యంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు.