చార్మినార్, హైదరాబాద్/సిటీ బ్యూరో జనవరి 10 (నమస్తే తెలంగాణ): ప్రికాషన్ డోస్తో కరోనా నుంచి అదనపు రక్షణ లభిస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఇతర దేశాల్లోనూ మూడో టీకా వేస్తున్నారని, మనం కూడా అదే దారిలో నడువాలని అన్నారు. ఫ్రంట్లైన్ వారియర్లు, హెల్త్కేర్ వర్కర్లు, 60 ఏండ్లు పైబడి ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు ప్రికాషన్ డోస్ పంపిణీని మంత్రి హరీశ్రావు సోమవారం ఎంఐఎం ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో కలిసి ప్రభుత్వ యునానీ దవాఖానలో ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు ముంతాజ్ అహ్మద్ఖాన్, పాషా ఖాద్రీ బూస్టర్ డోస్ వేసుకొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ఇద్దరు ఎమ్మెల్యేలకు మూడో టీకా వేస్తూ పంపిణీని ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని అన్నారు. అందరూ తప్పక వ్యాక్సిన్ వేసుకోవాలనే సందేశాన్ని వారు ప్రజలందరికీ ఇచ్చారని ప్రశంసించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రికాషన్ డోస్ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందరికీ ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తున్నదని, ప్రైవేటుకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని చెప్పారు. టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉన్నదని, రాష్ట్రంలో మొదటి డోస్ 102 శాతం(కేంద్రం ఇచ్చిన టార్గెట్ను మించి), సెకండ్ డోస్ 78 శాతం పూర్తయిందని చెప్పారు. 15 నుంచి 18 ఏండ్ల మధ్యవారికి ఆరు రోజుల్లోనే 38 శాతం మందికి మొదటి డోస్ పూర్తయిందని అన్నారు. బూస్టర్ డోస్తో పాటు 15 ఏండ్లు పైబడినవారికి టీకా పంపిణీలో ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
టీకా విషయంలో ఎలాంటి సంశయాలు అకర్లేదని పునరుద్ఘాటించారు. యునానీ దవాఖాన సమస్యలపై అరగంటకుపైగా చర్చించామని, దవాఖానను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. కరోనా నుంచి రక్షణ కోసం ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీపీహెచ్ శ్రీనివాస్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆయుష్ డైరెక్టర్ అలుగు వర్షిణి తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు ఉద్యోగులకు అండగా సర్కారు: హరీశ్రావు
ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం అరణ్యభవన్లో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం డైరీని మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రైవేట్ రంగంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెం డుగా ఉంటాయని, వాటిని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని అన్నారు. ఉద్యోగులకు సంక్రాం తి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడీఎస్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు, సంఘం అసోసియేట్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భాస్కర్, ఉపాధ్యక్షులు రామకృష్ణ, యాదగిరి గౌడ్, కార్యదర్శులు వేముల భాస్కర్, శివ కుమార్ యాదవ్, మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రభారెడ్డి తదితరులు పాల్గొన్నారు.