హైదరాబాద్ : ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన వైద్య, నర్సింగ్ కళాశాలల నిర్వహణకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. శనివారం వైద్య, నర్సింగ్ కళాశాలలు, కొవిడ్ వ్యాక్సినేషన్పై జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా మంజూరు చేసిన వైద్య, నర్సింగ్ కళాశాలల నిర్వమనకు జిల్లాకేంద్రాల్లో, రామవరం ఆసుప్రతిలో చేపట్టిన పనులను వచ్చే నెల 7వ తేదీ వరకు పూర్తి చేయాలని సూచించారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యాన్ని పెంచాలన్నారు. అలాగే విద్యార్థులకు వసతికి అవసరమైన హాస్టల్ భవనాలను సిద్ధం చేయాలన్నారు.
వ్యాక్సినేషన్లో లక్ష్యం చేరాలి
సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు తెలంగాణను వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రంగా నిలుపాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ డైయాగ్నోస్టిక్ సెంటర్స్ సేవలను ప్రజలకు అందించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా, మెడికల్ కాలేజీల వరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలను 100శాతం వ్యాక్సినేషన్ జరిగిన జిల్లాగా తీర్చిదిద్దేందుకు హ్యాబిటేషన్స్, గ్రామాలు, మండలాల వారీగా లక్ష్యాలను నిర్ధేశించాలని కలెక్టర్లకు సూచించారు.
టీకాతోనే కొవిడ్ నుంచి పూర్తిస్థాయి రక్షణ లభిస్తుందన్నారు. ప్రతివారం సాధించిన లక్ష్యాలపై సమీక్షించాలని చెప్పారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన వారు 2.77కోట్ల మంత్రి ఉన్నారని, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3.43లక్షల మందికి డోసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు గుర్తించిన వారిలో 85శాతం మంది మొదటి డోస్ తీసుకున్నారని, మిగిలిన వారికి కూడా వ్యాక్సిన్ వేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం చేసేందుకు పంచాయతీరాజ్, ఇతర శాఖల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు.
నెలాఖరు నాటికి లక్ష్యం చేరాలి
సీఎం చొరవతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన వైద్యులు, సిబ్బంది నియామక అధికారాలను కలెక్టర్లకు ఇచ్చినట్లు చెప్పారు. ఆసుపత్రిలో పరికరాలు పూర్తిగా వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఆసుపత్రుల్లో పేషెంట్స్ ఆక్యూపెన్సి, శస్త్ర చికిత్సలపై.. అల్లోపతి వైద్యంతో పాటు ఇతర విభాగాల వైద్యుల పనితీరును సమీక్షించాలన్నారు. ఆసుపత్రులకు మంజూరైన ఆక్సిజన్ ప్లాంట్ల పనులను పూర్తి చేయించాలన్నారు. శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, జిల్లా ఆసుపత్రి కమిటీ సమావేశాల్లో జిల్లాలకు మంజూరు చేసిన ఆర్బీఎస్కే యూనిట్లను యాక్టివేట్ చేయాలన్నారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేసి, నవంబర్ 30 వరకు వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు.