హైదరాబాద్ : దేశానికే ఆదర్శంగా, తెలంగాణ ప్రజలకు అత్యద్భుత టూరిస్ట్ స్పాట్గా కరీంనగర్ మానేరు తీరాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శనివారం డీపీఆర్ ఫైనలైజేషన్, రిటైనింగ్ వాల్ తుది డిజైన్లు, భూసేకరణ తదితర అంశాలపై గంగుల కమలాకర్ టూరిజం, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. మొత్తం 15కిలోమీటర్ల పొడవుగా ప్రతిపాదించిన మానేరు రివర్ ఫ్రంట్లో తొలి విడుతగా నాలుగు కిలోమీటర్ల మేర నిర్మాణాలు చేపట్టనున్నారు.
గతంలో పలు దఫాలుగా కన్సల్టెన్సీ, ఇరిగేషన్, టూరిజం శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన అంశాలపై ఇవాళ్టి సమావేశంలో సూచన ప్రాయ నిర్ణయం తీసుకున్నారు. ముంపు తగ్గించే విధంగా రివర్ ఫ్రంట్ అందాలు మరింత ద్విగిణీకృతమయ్యేలా హాఫ్ బరాజ్, హాఫ్ వీర్ ప్రాతిపదికన మొదటి విడుత నిర్మాణాలకు రూపొందించిన నివేదికలకు మంత్రి, ఇరిగేషన్ ఉన్నతాధికారులు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. గత వందేళ్ల నీటి విడుదల పరిమాణం ఆధారంగా 80 క్యూసెక్కులు మొదలు 3.50లక్షల క్యూసెక్కుల వరకూ నీటి విడుదల సమయాల్లో రివర్ ఫ్రంట్ రిటైనింగ్ వాల్ నిర్మాణం దశల్లో ఎత్తు, విడ్త్, డెప్త్పై చర్చించారు.
ఈ అంశంపై సర్వే ఏజెన్సీ అందజేసిన డిజైన్లను పరిశీలించిన అనంతరం అతి త్వరలోనే ఈ ప్రతిపాదనలపై ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వారం రోజుల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలతో పాటు మిగతా డిజైన్ పనులను పూర్తి చేయాలని మంత్రి గంగుల అధికారులను ఆదేశించారు. రోజు వారీగా పనుల్లో వేగం పెంచేందుకు ఏజెన్సీ ప్రతినిధులతో పాటు ఇరిగేషన్, టూరిజం అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ నెలాఖర్లోగా పూర్తి స్థాయి డీజైన్లు రూపొందించి టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు మొదలుపెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ నిధుల కొరత లేదన్నారు.
ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన తీగల వంతెన నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, రివర్ బెడ్ నిర్మాణం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో హాస్పిటాలిటీ ఏర్పాట్లు, చిల్డ్రన్ పార్క్స్, వాటర్ ఫైంటెన్స్, బోటింగ్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ ఇతర ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధర్, శంకర్, టూరిజం శాఖ ఈడీ శంకర్ రెడ్డి, టీఎస్ టీడీసీ సీఈ వెంకటరమణ, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్, ఐఎన్ఐ కన్సల్టేన్సీ డైరెక్టర్ హర్ష్ గోయల్, ఇతర రాష్ట్ర, కరీంనగర్ జిల్లా ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ, మున్సిపల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.