కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సుదీర్ఘమైన మలిదశ పోరాటం జరిపి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పోరాడి సాధించిన తెలంగాణను సీఎం కేసీఆర్ దేశంలోనే అన్ని రంగాల్లో నంబర్వన్ రాష్ట్రంగా నిలుపడం సంతోషంగా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా కరీంనగర్ రూరల్ మండలంలోని తీగలగుట్టపల్లిలో గల ఉత్తర తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం కరీంనగర్ పోలీస్ గ్రౌండ్లో నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ పోరాట యోధుల కుటుంబాలను, స్వాతంత్ర సమరయోధులను, అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. నాటి పోరాట వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం చేసిన వారి త్యాగాలు వృథా కావన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, కలెక్టర్ బీ గోపి, సీపీ సుబ్బారాయుడు, మేయర్ వై సునీల్ రావు, తదితరులు పాల్గొన్నారు.