Minister Gangula | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఈ పదేండ్లలో కరీంనగర్ జిల్లా సాధించిన ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో వేడుకలను జరపాలని అన్నారు. జూన్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లపై మండల, నియోజకవర్గాలవారీగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు. ప్రతి శాఖ పదేండ్ల ప్రగతి నివేదిక, పథకాలకు సంబంధించి ఫ్లెక్సీలు, ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామసభలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, మేయర్ యాదగిరి సునీల్ రావు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.