హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లకు ఎటువంటి అవరోధాలు లేవని, రైతులు వదంతులు, గాలి మాటలను నమ్మొద్దని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొనుగోళ్లకు సరైన ఏర్పాట్లు లేవనే ఆరోపణలను ఆయన ఖండించారు. కొనుగోళ్లకు అవసరమైన నిధులు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, క్లీనర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సమస్యలపై ఫిర్యాదుకు రైతులు 1800 425 00333 లేదా 1967 టోల్ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఇక తుఫాను నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద తగిన చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లపై బుధవారం హైదరాబాద్లో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనేందుకు నిరాకరించడంతో సీఎం కేసీఆర్ సుమారు రూ. 3వేల కోట్ల నష్టాన్ని భరించేందుకు సిద్ధమై ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారని చెప్పారు. గన్నీలకు కొరత లేదని ఇంకా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాం కొనుగోలుకు అవసరమయ్యే 6.35 కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో 2,77,866 టార్పాలిన్లు, 11,523 వేయింగ్ మిషన్లు, 11,000 మాయిశ్చర్ మీటర్లు, 4,958 పాడీ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, ఎక్కడైనా స్టోరేజి కొరత ఉన్నచోట లీజుకు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం వరకు 5,774 కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో 3,760 కేంద్రాల్లోనే కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటివరకు 1.56 లక్షల మంది రైతుల నుంచి రూ. 2121 కోట్ల విలువగల 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. అసని తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, సివిల్ సైప్లె శాఖకు చెందిన డీసీఎస్వోలు, డీఎంలు అప్రమత్తంగా ఉండి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యాసంగి, వానకాలం ధాన్యం సీఎంఆర్ను గడువులోపు అందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్, డిప్యూటీ కమిషనర్ రుక్మిణి పాల్గొన్నారు.